దేశంలో పురుషులతో పోలిస్తే స్త్రీల సంఖ్య తగ్గుతున్నది. కానీ త్రిపురలో మాత్రం దీనికి భిన్నంగా ఉన్నది. రాష్ట్రంలో స్త్రీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. త్రిపురలో పురుషులు, స్త్రీల లింగనిష్పత్తి 1000:1011గా ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక పేర్కొన్నది. ఇది 2015–16లో 1000:998గా ఉంది. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య పెరుగుతున్నదని రాష్ట్ర మంత్రి రతన్ నాథ్ చెప్పారు. గ్రామాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1033 మంది మహిళలు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 956 మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి ఇదే నిదర్శణమని వెల్లడించారు. శిశు జననాల్లో కూడా బాలిక సంఖ్యే ఎక్కువగా ఉన్నదని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 1028 మంది బాలికలు ఉన్నారని వెల్లడిచింది. ఐదేండ్ల క్రితం (2015-16) ఈ లింగ నిష్పత్తి 1000:956గా ఉన్నది. సంస్థాగత జననాలు కూడా 89.02 శాతంగా నమోదయ్యాయి. ఇది గతంలో 79.09 శాతంగా ఉంది. 12 నుంచి 13 నెలల వయస్సులోపు పిల్లలకు టీకాలు వేసే విషయంలో కూడా మెరుగుదల కనిపించిందని తెలిపింది. 2015-16లో ఇది 54.05 ఉండగా, ప్రస్తుతం అది 69.05 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
త్రిపురలో మహిళలదే బలం
Related tags :