Health

షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకు ఎన్నిసార్లు తినాలి?

షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకు ఎన్నిసార్లు తినాలి?

డయాబెటీస్ బాధితులు రోజులో ఎన్నిసార్లు తినాలో తెలుసా?

మీకు డయాబెటీస్ ఉందా? లేదా డయాబెటీస్ వచ్చే ముప్పు ఉందా? అయితే, మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవల్సిందే.

 డయాబెటిస్ (మధుమేహం) వచ్చిందంటే చాలు.. జీవితం మొత్తం మారిపోతుంది. ఆహారం నుంచి నిద్ర వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే.. శరీరంలోని అవయవాలు షుగర్ ప్రభావం, ఇన్సులిన్ లోపం వల్ల క్రమేనా పనిచేయడం మానేస్తాయి. అయితే, డయాబెటీస్ బాధితులు ఆహారాన్ని తీసుకొనే విషయంలో చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. చాలామంది నోరు కట్టేసుకుంటారు. లేదా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మాత్రమే భోజనం చేసి షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతున్నామని భావిస్తారు. అయితే, ఈ లెక్క కరెక్ట్ కాదు.

షుగర్ తగ్గిపోతే ప్రమాదమే: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడమనేది డయాబెటీస్ రోగులకు పెద్ద ఛాలెంజ్. చాలామంది శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితేనే ప్రమాదకరమని భావిస్తారు. కానీ, అది తప్పు. శరీరంలో చక్కెర స్థాయి పడిపోతే మూర్చపోయే ప్రమాదం ఉంది. అలాగే నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చక్కెర స్థాయిలు పడిపోకుండా స్థిరంగా ఉంచుకోవల్సిన అవసరం ఉంది. సాధారణ వ్యక్తులు రోజులో మూడు పూట్ల తింటే సరిపోతుంది. కానీ, డయాబెటీస్ బాధితుల విషయానికి వస్తే.. ఈ లెక్క సరిపోదు.

ఎన్నిసార్లు తినాలి?: టైప్-2 డయాబెటీస్‌తో బాధపడే బాధితులు శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. రోజు మొత్తంలో మధ్య మధ్యలో శరీరానికి కార్బోహైడ్రేట్లు అందేలా చూసుకోవాలి. ఒక్కసారే ఆహారాన్ని లాగిస్తే (లంచ్, డిన్నర్) బ్లడ్ షుగర్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. షుగర్ మందులు తీసుకున్నా సరే పరిస్థితి అదుపులో ఉండదు. డయాబెటీస్‌తో బాధితులు రోజు మొత్తంలో సమాన పరిమాణంలో శరీరానికి కార్బోహైడ్రేట్లు అందించాలి. అంటే.. ఒక్కాసరే భోజనం చేయకుండా తక్కువ పరిమాణంలో కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకోవాలి.

అధ్యయనాల్లో ఏం తేలిందంటే..: 2018లో ‘డయాబెటీస్ అండ్ మెటబొలిజం’లో ప్రచురించిన ఓ అధ్యయనంలో.. రోజంతా కొద్ది కొద్దిగా ఆహారాన్ని తీసుకోవడం డయాబెటీస్ రోగులకు చాలామంచిదని తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా టైప్-2 డయాబెటీక్స్, ప్రీడయాబెటీక్స్ 47 మంది పెద్దలు అధ్యయనం నిర్వహించారు. వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. ప్రీడయాబెటిక్స్‌ను రెండు గ్రూపులుగా విభజించారు. మూడో గ్రూపులో డయాబెటీస్ బాధితులను ఉంచారు. 12 వారాలపాటు వారు తీసుకొనే ఆహారాన్ని పరిశీలించారు. వీరిలో రోజంతా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకొనే వ్యక్తుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉన్నట్లు తెలుసుకున్నారు.

తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు: రోజంతా భారీగా తినేయకుండా కొద్ది కొద్దిగా ఆహారం తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక గ్లూకోజ్ మీ రక్తంలో చేరకుండా ఉంటుంది. అయితే, మూడు పూటల ఎక్కువ ఆహారాన్ని తీసుకొనేవారికి రోజంతా కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా అనారోగ్యకర ఆహారాన్ని తీసుకోలేరు. ఒక వేళ మీరు వ్యాయమం చేస్తూ బరువు తగ్గే ప్లాన్‌లో ఉంటే తక్కువ ఆహారాన్ని తీసుకొనే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే.. మీకు ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా మీ డైటీషియన్ లేదా వైద్యుడి సలహా తీసుకోవాలి.

ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి?: రోజంతా కొద్దిగా కొద్దిగా ఆహారాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో చిల్లర తిండ్లు తినొద్దు. కేవలం మీ శరీరానికి పోషకాలను అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అయితే, ఆహారం తినకుండా ఉపవాసాలు చేయొద్దు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ మానొద్దు. రోజు ఆరంభంలో మీరు తీసుకొనే ఆహారమే జీవక్రియను పెంపొందిస్తుంది. శరీరం వేడి కాకుండా చూస్తుంది. కాబట్టి రోజంతా మీ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోండి. దానికి తగినట్లే ఆహారాన్ని తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.