Politics

రాజకీయాలతో పాటు సినిమాలు చేయమని చెప్పింది చిరంజీవే-తాజావార్తలు

రాజకీయాలతో పాటు సినిమాలు చేయమని చెప్పింది చిరంజీవే-తాజావార్తలు

* జనసేన కార్యకర్తల భేటీలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది ఆయన సోదరుడు చిరంజీవేనని చెప్పారు. విజయవాడలో మూడు నియోజకవర్గాల పరిధిలోని జనసేన క్రియాశీల కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమాకు సంబంధించిన బాండ్‌లను మనోహర్‌ పంపిణీ చేశారు.

* ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చక్కటి నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చెప్పారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్మాణాత్మక సూచనలు చేసిందన్నారు. సీఎస్‌, డీజీపీతో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చక్కటి సంబంధాలున్నాయని.. సమన్వయంతో ఎలాంటి పని అయినా నిర్వర్తించుకోగలమనే విషయాన్ని గవర్నర్‌కు తెలిపానని చెప్పారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ మాట్లాడారు.

* రామ్‌చరణ్, తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్ వివాదానికి తెరలేపింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల తేదీ పట్ల బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా తాను నిర్మించిన ‘మైదాన్‌’ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్‌ 15న విడుదల చేయనున్నట్లు ఆరు నెలల ముందే ప్రకటించినప్పటికీ అదే నెలలో 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమని ఆయన అన్నారు.

* ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చక్కటి నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చెప్పారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్మాణాత్మక సూచనలు చేసిందన్నారు. సీఎస్‌, డీజీపీతో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చక్కటి సంబంధాలున్నాయని.. సమన్వయంతో ఎలాంటి పని అయినా నిర్వర్తించుకోగలమనే విషయాన్ని గవర్నర్‌కు తెలిపానని చెప్పారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ మాట్లాడారు.

* కోర్టు ధిక్కారం కేసులో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం శాఖ కార్యదర్శి, ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, ఏలూరు డీఐజీ ఇవాళ హైకోర్టుకు హాజరయ్యారు. ఎస్‌ఐ రామారావు తన పదోన్నతి విషయంలో గతంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పదోన్నతి జాబితాలో రామారావు పేరు చేర్చాలని పోలీసు శాఖను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ రామారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం శాఖ కార్యదర్శి, ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, ఏలూరు డీఐజీని కోర్టుకు హాజరుకావాలని గతంలో ఉత్తర్వుల జారీ చేసింది.

* ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని పీఆర్‌సీ నివేదికలో పొందుపర్చిన విషయం తెలియగానే తెలంగాణ ఉద్యోగులుగా జీర్ణించుకోలేకపోయామని టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మెరుగైన వేతనాలు అందుకుంటామని భావిస్తున్న ఉద్యోగులను పీఆర్‌సీ నివేదిక పూర్తిగా నిరాశకు గురి చేసిందని చెప్పారు. పీఆర్‌సీ అంటే ‘పే రివైజ్‌’ కావాలి కానీ తాజా నివేదికలో ‘పే రిడక్షన్‌’ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పీఆర్‌సీ నివేదిక చూసిన తర్వాత రాష్ట్రంలోని ఉద్యోగులందరూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.

* కరోనా కట్టడే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను పొడిగించింది. నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్గదర్శకాలే ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండటంతో మరిన్ని ఉపశమనాలు కల్పించింది. గతంలో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. ఈసారి అధిక సామర్థ్యంతో తెరుచుకోవచ్చని పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 111 కేసులు నిర్ధారణ కాగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,349కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,152 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 97 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,369 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

* గణతంత్ర దినోత్సవం వేళ రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌ ఉద్రిక్తంగా మారిన వేళ పంజాబ్‌కు చెందిన సినీ నటుడు దీప్‌ సిద్ధూ పేరు తెరపైకి వచ్చింది. ఎర్రకోట ముట్టడికి ఆయనే కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్నీ దేవోల్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. భాజపా ఎంపీ అయిన దేవోల్‌కు, దీప్‌ సిద్ధూకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో దేవోల్‌ స్పందించారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ దీప్‌ సిద్ధూతో ఎలాంటి సంబంధాలూ లేవని ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బడ్జెట్ ఫోన్‌ శ్రేణిలో తన మార్కెట్ పరిధిని విస్తరించుకునేందుకు శాంసంగ్‌ కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. కొద్దిరోజుల క్రితం గెలాక్సీ ఎం02ఎస్‌ మోడల్‌ను విడుదల చేసిన శాంసంగ్‌ తాజాగా గెలాక్సీ ఏ02ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో బడ్జెట్‌ లేదా ఎంట్రీ లెవల్ ఫోన్ కొనాలంటే రెడ్‌మీ లేదా రియల్‌మీలవైపే ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. వాటికి పోటీగా శాంసంగ్ ఈ కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టింది.

* ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న బ్రిటన్‌ రకం కరోనా స్ట్రెయిన్‌పై ‘కొవాగ్జిన్‌’ టీకా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌ను ‘కొవాగ్జిన్‌’ సమర్థవంతంగా తటస్థీకరించడంతో పాటు మ్యుటేషన్‌ చెందుతూ వైరస్‌ తప్పించుకునే ప్రభావాన్ని కూడా తగ్గిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న 26 కేసులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం, వీటిని ధ్రువపరిచే పరిశోధనా సమాచారాన్ని విడుదల చేసింది.

* బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత నిలకడగా ఉందని తెలిసింది. ఆయన ఆరోగ్యంపై దిగులుపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దాదా ఈసీజీ రిపోర్టులో స్వల్ప మార్పులు కనిపించాయి. బుధవారం రాత్రి వైద్యులంతా కలిసి రెండో యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దాదాపుగా గురువారం రెండో స్టెంటు అమర్చే అవకాశం ఉంది. గతంలోనే గుండెనొప్పితో బాధపడిన దాదా హృదయ రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించారు.

* చైనా సామాజికమాధ్యమ సంస్థ బైట్‌డాన్స్‌ భారత్‌లో కార్యకలాపాలకు బై బై చెప్పేందుకు సిద్ధమైంది. టిక్‌టాక్‌ సహా ఇతర చైనీస్‌ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో, సిబ్బంది తగ్గింపుపై బైట్‌డాన్స్ తన భారత ఉద్యోగులకు సమాచారమిచ్చింది. భారత్‌లో తమ సంస్థ కార్యకలాపాలు, సిబ్బంది తగ్గించే నిర్ణయాన్ని టిక్‌టాక్‌ తాత్కాలిక గ్లోబల్‌ హెడ్‌ వనెస్సా పప్పాస్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బ్లేక్‌ చాండ్లీ సిబ్బందికి ఈ మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారు. భారత్‌కు మళ్లీ తిరిగి రావడంపై సందేహమేనన్న బైట్‌డాన్స్‌ ప్రతినిధులు, రానున్న రోజుల్లో అలా జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

* సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. సిద్దిపేట పట్టణంలోని ఒంటి మామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్ కమిటీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ కూరగాయలు సాగు చేస్తున్న రైతులతో కేసీఆర్‌ మాట్లాడారు. పంటల సాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ సౌకర్యం, బహిరంగ విపణిలో కూరగాయల ధరల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విపణిలో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే మంచి ధర లభిస్తుందని రైతులకు కేసీఆర్‌ సూచించారు. సాగు మెళకువలు తెలుసుకొని శాస్త్రీయ విధానంలో పంటల సాగు చేపడితే వ్యవసాయం, కూరగాయల సాగు లాభసాటిగా ఉంటుందన్నారు. కూరగాయల రైతుల నుంచి ఏజెంట్లు 4శాతం కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దని, ఆ దిశగా మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

* ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) జారీ చేసిన అభిశంసన ఉత్తర్వులు (సెన్సూర్‌ ప్రొసీడింగ్స్‌)ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీకి తిప్పి పంపింది. ఐఏఎస్‌లపై ప్రొసీడింగ్స్‌ జారీ చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని ప్రభుత్వం పేర్కొంది. వివరణ కోరకుండా ప్రొసీడింగ్స్‌ జారీ చేయలేరని స్పష్టం చేసింది.

* దేశ రాజధానిలో నిన్న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో రైతు ఉద్యమంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆందోళనల నుంచి వైదొలుగుతున్నట్టు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా చేపడుతున్న ఆందోళనల నుంచి తప్పుకొంటున్నట్టు రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌ (ఆర్‌కేఎంఎస్‌) కన్వీనర్‌ సర్దార్‌ వీఎం సింగ్‌ ప్రకటించారు. అలాగే, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (భాను) కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. ఈ సందర్భంగా వీఎం సింగ్‌ మాట్లాడుతూ.. నిన్న దిల్లీలో జరిగిన ఘటనలు బాధించాయని పేర్కొన్నారు. ఇతరుల ఆధ్వర్యంలో నిరసన కొనసాగించలేమన్నారు. కొన్ని రైతు సంఘాలు ఇతరులు చెప్పినట్టు పనిచేస్తున్నాయని వీఎం సింగ్‌ ఆరోపించారు. నిన్నటి ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. రాకేశ్‌ తికాయత్‌ వంటి నేతల వైఖరితోనే ఉద్రిక్తత నెలకొందన్నారు. నిర్ణీత సమయం కంటే ముందే ర్యాలీ నిర్వహించడం వల్లే ఉద్రిక్తతలు తలెత్తిన్నట్టు చెప్పారు. ర్యాలీని ఇతర మార్గాల్లో ఎందుకు తీసుకెళ్లారని ఆయన ప్రశ్నించారు.

* టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయంపై చైనా ఆక్రోశం వ్యక్తంచేసింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఈ చర్యలు చైనా సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని చిందులు తొక్కుతోంది. గతేడాది ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో చైనా దురాక్రమణకు కళ్లెం వేసేందుకు భారత్‌ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో జారీ చేసిన నోటీసులపై ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై ఇటీవల నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.