ScienceAndTech

రాజస్థాన్ దొంగలు…తెలుగు రాష్ట్రాల్లో ₹712కోట్ల మోసాలు

రాజస్థాన్ దొంగలు…తెలుగు రాష్ట్రాల్లో ₹712కోట్ల మోసాలు

రాజస్థాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌ జిల్లాలో 100కుపైగా గ్రామాలు, హరియాణా సరిహద్దులోని అల్వార్‌, మేవాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర జిల్లాలోని పలు గ్రామాల్లో దొంగలు నివాసముంటున్నారు. మేవాత్‌ తెగకు చెందిన వీరంతా హిందీ మాట్లాడతారు. ఒకప్పుడు దొంగతనాలు, దారిదోపిడీలు చేసే వీళ్లంతా ఇప్పుడు సైబర్‌ నేరాల బాటపట్టారు. యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో సంభాషించే వ్యక్తుల భాషను అనుకరిస్తారు. ఈ వృత్తిలోని వారంతా విలాసవంతమైన జీవితం గడుపుతుండటంతో ఒకరితర్వాత ఒకరుగా చుట్టుపక్కల గ్రామాల యువతా ఇదే బాటపట్టారు. ఇప్పుడు వివిధ గ్రామాల్లో సుమారు నాలుగైదు వేలమంది యువకులు మోసాలనే వృత్తిగా మార్చుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ‘‘మూడేళ్లలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే తొమ్మిది వేల మందికిపైగా వీరి బారినపడ్డారు. వారి నుంచి నేరస్థులు సుమారు రూ.712 కోట్లు కొల్లగొట్టారు. వారిని అరెస్టు చేసేందుకు వెళ్తున్న పోలీసులపై దాడులు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో వీరిని పట్టుకునేందుకు వెళ్లిన దిల్లీ పోలీసులపై ఏకంగా నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. సాయుధ బలగాలు వెళ్లిన సందర్భాల్లో పది, పదిహేను మంది పట్టుబడుతున్నప్పటికీ మోసాలు ఆగడం లేదు. దోచుకున్న సొమ్ముతో వారంతా విలాసవంతమైన ఇళ్లు కట్టించుకుంటున్నారు. ఇళ్లలో ప్రతిగదికీ ఏసీ, క్యూఎల్‌ఈడీ టీవీలు అమర్చుకుని జల్సా జీవితం గడుపుతున్నారు’ అని ఓ పోలీస్‌ అధికారి చెప్పారు.

తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రలపైనే భరత్‌పూర్‌ దొంగలు దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్‌ సహా నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో హిందీ అర్థం చేసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో పదేపదే ఆయా జిల్లా వాసులకు ఎరవేస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూరు, బీదర్‌, కలబురిగి, రాయచూరు జిల్లాలు, మహారాష్ట్రలోని ముంబయి, పుణె, నాగ్‌పుర్‌ జిల్లాల వారిపైనా తరచూ వల విసురుతున్నారు. ‘ఐదారుగురు కలిసి ముఠాగా ఏర్పడుతారు. వీరంతా రోజుకు సగటున 300 మందికి ఫోన్‌ చేస్తారు. ఫేస్‌బుక్‌ ద్వారా మరో 200 మందితో ఛాటింగ్‌ చేస్తారు. కనీసం పదిశాతం మంది స్పందించినా గిట్టుబాటవుతుందనే భావనలో వీళ్లున్నారు. ఒక్కోరోజు వందలమంది వీరి బారినపడి మోసపోతున్న ఉదంతాలు ఉన్నాయని’ పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా మోసాలు బంగారు ఇటుకలతో ప్రారంభమయ్యాయి. తమ పొలాల్లో తవ్వుతుండగా అవి బయటపడ్డాయని, తక్కువ ధరకే అమ్మేస్తామంటూ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లోని వ్యక్తులకు సంక్షిప్త సందేశం పంపించి అక్కడికి వెళ్లిన వారి నుంచి నగదు దోచుకున్నారు. కొంతకాలం తర్వాత సీసీ కెమెరాలు అత్యంత చౌక ధరలకే సరఫరా చేస్తామని రప్పించి, కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. పాత వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాల కోసం క్వికర్‌, ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్లు వచ్చాక వాళ్ల శైలి మారిపోయింది.

కొనుగోలుదారులు నమ్మేందుకు వీలుగా సైన్యంలో విధులు నిర్వహిస్తున్నవారి ఫొటోలను వివిధ మార్గాల్లో సేకరించి, వారి గుర్తింపు కార్డులను మార్ఫింగ్‌ చేసి తమ ఫొటోలను అతికిస్తారు. ఈ రెండు దశలు పూర్తయ్యాక ప్రకటనకర్తలు అమ్మకానికి ఉంచిన బైకులు, కార్ల నంబర్లు సేకరిస్తారు. అవి తమవేనని నమ్మిస్తూ పాత వస్తువుల క్రయవిక్రయాలు జరిపే వెబ్‌సైట్‌లలో ప్రకటనలు గుప్పిస్తారు. రూ.3 లక్షల కారును రూ.1.50 లక్షలు, రూ.90 వేల విలువైన బుల్లెట్‌ను రూ.45 వేలకు ఇస్తామంటూ ప్రకటిస్తున్నారు. ఏ ప్రాంతం వారికి ఎర వేయాలని భావిస్తే ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ జరిగిన వాహనాల ఫొటోలను ప్రకటనల్లో ఉంచుతున్నారు. ఈ తరహా మోసాలు కొనసాగిస్తూనే ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు ప్రారంభించి వసూళ్లకు పాల్పడటాన్ని మొదలుపెట్టారు. కేవలం అయిదారు నెలల్లో దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న 90 మంది ఐఏఎస్‌లు, 80 మంది ఐపీఎస్‌ల పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతాలు ప్రారంభించారు. రూ.లక్షల్లో నగదు బదిలీ చేసుకున్నారు. కర్ణాటకలో కీలక ఐపీఎస్‌ అధికారి పేరుతో నకిలీ ఖాతా తెరిచి, నగదు పంపించాలనే అభ్యర్థనలు పంపడంతో ఆయన స్నేహితులు రూ.9 లక్షలు జమచేశారు. ఓ స్నేహితుడు ఫోన్‌ చేసి ఆరా తీయడంతో ఆయన మేలుకున్నారు. తర్వాత పోలీస్‌ ఠాణాల ఫేస్‌బుక్‌ పేజీల ఆధారంగా ఇన్‌స్పెక్టర్ల వివరాలు సేకరించి, వారి పేర్లతోనూ నకిలీ ఖాతాలు ప్రారంభించిన కేటుగాళ్లు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. భరత్‌పూర్‌ ముఠాలకు వందల సంఖ్యలో సిమ్‌కార్డులు, వేర్వేరు పేర్లతో బ్యాంకు ఖాతాలను సమకూర్చేవారున్నారు. కొందరు హరియాణా సరిహద్దు జిల్లాలకు వెళ్లి సిమ్‌కార్డులను కొంటున్నారు. దిల్లీ శివారు ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు, తోటమాలులు, ఆఫీస్‌బాయ్‌లుగా పనిచేస్తున్న ఈశాన్య రాష్ట్రాల వాసుల నుంచి ఆధార్‌కార్డులు తీసుకుని, వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. స్వగ్రామాల్లో బ్యాంకు ఖాతాలున్న వారి ఏటీఎం కార్డు తీసుకుని లావాదేవీలు జరుపుతూ కమీషన్‌గా వారికి రూ.1000-5,000 వరకూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నేరగాళ్లకు స్థానికులు అండగా నిలుస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కొద్దినెలల నుంచి ఫేస్‌బుక్‌లోని మార్కెట్‌ప్లేస్‌(ప్రకటనలున్న పేజీ) ద్వారా ఒకే తరహాలో వేలమందిని మోసగిస్తున్నారు. మార్కెట్‌ ప్లేస్‌లోని ప్రకటనలు చూసిన వెంటనే ఆ వస్తువులు, ఉత్పత్తులు కొంటామంటూ ప్రకటనకర్తలకు ఫోన్‌ చేస్తున్నారు. సరిగ్గా నగదు బదిలీ చేసేటప్పుడు మాయాజాలం ప్రదర్శిస్తూ బాధితుల ఖాతాల్లోని డబ్బంతా కొల్లగొడుతున్నారు. ‘ఉదాహరణకు పాత రిఫ్రిజిరేటర్‌ కొంటామంటూ సైబర్‌ నేరస్థుడు దాన్ని అమ్మకానికి పెట్టిన వ్యక్తికి ఫోన్‌ చేస్తాడు. మీరు సూచించిన ధర రూ.8 వేలకే దాన్ని కొనుగోలు చేస్తానని, గూగుల్‌పే లేదా ఫోన్‌పే నంబరు చెబితే ముందుగా రూ.10 పంపి, తర్వాత మిగిలింది పంపుతానంటాడు. ఆ మేరకు రూ.10 పంపిస్తాడు. మిగిలిన సొమ్ము జమకాలేదేమిటని ఆరా తీయగానే చేతివాటం ప్రదర్శిస్తాడు. ‘‘ఫోన్‌పే యాప్‌లో ఏదో సమస్య ఉంది. నగదు బదిలీ కావడం లేదు. మీ ఫోన్‌కు క్యూఆర్‌ కోడ్‌ పంపుతా. దాన్ని స్కాన్‌చేసి రూ.8 వేలు నమోదుచేస్తే ఆ మొత్తం మీ ఖాతాకు జమవుతుందని చెబుతాడు. క్యూఆర్‌ కోడ్‌లో రూ.8 వేలు నమోదు చేయగానే బాధితుడి ఖాతాలోని సదరు మొత్తం సైబర్‌ నేరస్థుడి ఖాతాకు బదిలీ అవుతుంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ‘పొరపాటైంది. ఈసారి క్యూఆర్‌కోడ్‌లో రూ.16 వేలు(వస్తువు ధర+కొల్లగొట్టిన రూ.8 వేలు కలిపి) నమోదుచేయండని’ నమ్మబలుకుతాడు. అలా చేయగానే రూ.16 వేలు నిందితుడి ఖాతాలోకి వెళ్తుంది. ఇలా బాధితుడి ఖాతాలో నగదు నిల్వలు ఖాళీ అయ్యేంతవరకూ చేస్తాడు’’ అని పోలీసులు వివరిస్తున్నారు.