Business

ప్యూర్ ఈవీ విద్యుత్ బైక్ ధర ₹1లక్ష

Pure EV Electric Bike To Be Released On Aug 15th

తాజాగా ఐఐటి హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ కంపెనీ సరికొత్త ఎలక్రిక్ మోటార్ బైక్ ను రూపొందించింది. ఈ బైక్ మార్కెట్ లోకి వస్తే.. విదేశీ మోడళ్లకు సవాల్ విసరనున్నదనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఈవీ, తమ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘ఈట్రస్ట్ 350’ను ఆవిష్కరించింది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను త్వరలోనే మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నామని తెలిపింది. అంతేకాదు మనదేశంలో కాలుష్యానికి చెక్ పెట్టడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నదని.. దీనిని దృష్టిలో పెట్టుకుని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త సామర్థ్యాలతో ఈట్రస్ట్ 350 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేశామని తెలిపింది. ఈ మోడల్ ను స్వాతంత్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది సదరు కంపెనీ.

అంతేకాదు ఈ ఎలక్రికల్ బైక్ పూర్తి స్థాయిలో భారతీయ ఉత్పత్తి కావడం విశేషం. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్ ను రూపొందించామని.. ఉత్పత్తి, నిర్మాణం అన్నీ స్థానికంగానే జరగనున్నాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ ట్రస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చామని, ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 120 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 50 డెమో ఈట్రస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను టెస్ట్ రైడ్ కోసం అందుబాటులో ఉంచనున్నామని తెలిపింది. కస్టమర్ల కొనుగోళ్ల కోసం ఈ మోడల్‌ను ఆగస్ట్ 2021 నాటికి విడుదల చేయాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా నివేదికల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ముందుగా బెంగళూరు, హైదరాబాద్ మరియు పూణే నగరాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ప్యూర్ ఈట్రస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను హైదరాబాద్‌లోని కంపెనీ ప్లాంట్‌లోనే తయారు చేయనున్నారు. మార్కెట్లో దీని ధర సుమారు రూ.1 లక్ష రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ప్యూర్ ఈట్రస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్‌ గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌ను అధికారికంగా విడుదల చేసే సమయంలో కంపెనీ దీని బ్యాటరీపై ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్యూర్ ఈవీ ప్రస్తుతం భారతదేశం అంతటా 100 టచ్ పాయింట్లను కలిగి ఉంది. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ తన నెట్‌వర్క్‌ను విస్తరించాలని యోచిస్తోంది. అంతేకాకుండా, నేపాల్ వంటి పొరుగు మార్కెట్లతో పాటుగా దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇక మరోవైపు ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను ప్రోత్సహించేందుకు గాను భారత ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్ 2లోని ఆర్థిక ప్రయోనాజలు కూడా ప్యూర్ ఈవీకి లభించే అవకాశం ఉంది.