Politics

తెరాస కన్నా బాగా పరిపాలిస్తా

YS Sharmila Considering Two Dates For Party Launch

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. పార్టీ ఆవిష్కరణకు రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మే 14న షర్మిల పార్టీ ఆవిష్కరణ?.. లేదా జూలై 8న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. గతంలో మే 14న ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మే 14నే పార్టీ జెండా అజెండా ప్రారంభిస్తే పాదయాత్ర లకు వెల్లొచ్చని ముఖ్య నేతలు షర్మిలకు సూచించినట్లు సమాచారం. జూలై 8న రాజశేఖర్ రెడ్డి జయంతి కావడంతో ఆ రోజును షర్మిల సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అయితే జూలై 8 నాటికి ఆలస్యం అవుతుందని ముఖ్యనేతలు చెబుతున్నట్లు తెలియవచ్చింది. కాగా రెండు తేదీల్లో ఒకదానిని ఫైనల్ చేసే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం.

రాజన్న పాలన, సంక్షేమ పథకాలు ఉండాలని కోరుతూ వచ్చే ప్రతి ఒక్కరూ షర్మిల కొత్త పార్టీలోకి ఆహ్వానితులేనేని, ఏ పార్టీ నుంచి వచ్చినా ఆహ్వానిస్తామని కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన లోటస్ పాండ్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక మహిళ పార్టీ నడిపిన దాఖలాలు లేవని అన్నారు. మొదటిసారిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ప్రజల్లోకి వస్తున్నారని.. ముఖ్యంగా మహిళలు ఆమెకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆత్మీయ సమ్మేళనాలు ఉన్నాయని, ఆ తర్వాత అన్ని జిల్లాల నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రాఘవరెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదానికంటే మెరుగైన పద్ధతిలో ముందుకు వెళతామన్నారు. మమ్మల్ని విమర్శిస్తున్నవాళ్లకు తాము వేస్తున్న అడుగులే జవాబులని చెప్పారు.