WorldWonders

వెనెజులాలో ₹10లక్షల నోటు

Venezuala Prints Million Note Due To Inflation

మన దేశంలో నోట్ల రద్దుకు ముందు రూ. వెయ్యి నోటే అతిపెద్దది. ఆ తర్వాత వాటిని రద్దు చేసి రూ. 2వేల నోట్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిని చూసి చాలా మంది అంతపెద్ద నోటా అని ముక్కున వేలేసుకున్నారు. వందలు, ఐదు వందల నోట్లను కట్టలుగా తీసుకెళ్లే కన్నా.. ఈ రూ. 2వేల నోట్లను తీసుకెళ్తే సులువుగా ఉంటుంది కదా..! ఇదే కారణంతో వెనిజువెలా ప్రభుత్వం ఏకంగా 1 మిలియన్‌ బొలివర్స్‌(ఆ దేశ కరెన్సీ) నోట్లను తీసుకురానుంది. ప్రపంచంలో అత్యధిక విలువ చేసే నోటును జారీ చేస్తున్న ఏకైక దేశం ఇదే.
*దక్షిణ అమెరికాలో భాగంగా ఉండే వెనిజువెలా ఒకప్పుడు అత్యంత ధనిక దేశం. అక్కడ చమురు, బంగారు నిక్షేపాలు సమృద్ధిగా ఉండేవి. ప్రభుత్వానికి 95శాతం రెవెన్యూ చమురు ద్వారానే లభించేది. అయితే, 1990ల్లో అధికారంలోకి వచ్చిన హ్యోగో చావెజ్‌ ప్రభుత్వం తప్పటడుగులు వేసింది. చమురు నిల్వలు ఉన్నాయన్న ధీమాతో ఎక్కడ అప్పు దొరికితే అక్కడ విపరీతంగా డబ్బులు తీసుకొచ్చి దేశంలో ఖర్చు చేశారు. ప్రజలకు ఆల్‌ ఫ్రీ పథకాలు అమలు చేసి సంతోషపెట్టే ప్రయత్నం చేశారు. దేశంలో ఎవరికీ పని చెప్పకుండా ప్రతి వస్తువును విదేశాల నుంచి దిగుమతి తెచ్చుకున్నారు. చమురు ధరలు పెరిగినప్పుడు వచ్చిన ఆదాయాన్ని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సంక్షేమ పథకాల పేరుతో విచ్చలవిడిగా ఖర్చుపెట్టేశారు.
*ధరలు నింగికి.. కరెన్సీ విలువ పాతాళానికి
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా..! చమురు ధరలు భారీగా పడిపోవడంతో దేశం అప్పుల్లో కూరుకుపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల భారం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైంది. దీన్ని సరిచేయాలన్న ఉద్దేశంలో ఎక్కువ కరెన్సీ నోట్లను ముద్రించారు. అయినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. దీంతో కరెన్సీ విలువ పతనమైంది. సంచుల నిండా డబ్బులు తీసుకెళ్లినా కిలో టమోటా కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. 2013లో హ్యోగో చావేజ్‌ మరణించడంతో నూతన అధ్యక్షుడిగా నికోలస్‌ మదురో అధికారంలోకి వచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
*మన రూపాయితో పోలిస్తే వెనెజులా బొలివర్‌ మారకం విలువ రూ. 25,584గా ఉందంటే వెనిజువెలా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కప్పు కాఫీ తాగాలన్నా సంచుల నిండా నోట్ల కట్టలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే.. ఆ బాధ తప్పించడానికి, జాతీయ ఆర్థిక అవసరాలను అనుగుణంగా ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎక్కువ విలువవున్న కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుందట. ఇప్పటికే 10,000, 20,000, 50,000 బొలివర్స్‌ నోట్లను జారీ చేస్తుండగా.. తాజాగా 1 మిలియన్‌ బొలివర్‌ నోట్లను ముద్రించడానికి సిద్ధమైంది. 1 మిలియన్‌ బొలివర్స్‌ మన దేశ కరెన్సీలో దాదాపు రూ.39తో సమానం. ఈ నోట్లే కాకుండా.. 2లక్షలు, 5లక్షల నోట్లను కూడా ముద్రిస్తారట.