తానా 2021 ఎన్నికల్లో చిరునామాల్లో ఏర్పడిన సాంకేతిక లోపాల కారణంగా ఆలస్యం అయిన బ్యాలెట్ల పంపిణీని ఈ శుక్రవారం నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం జరిగినట్లు BOD చైర్మన్ హరీష్ కోయాతో కలిసి ఆయన TNIతో మాట్లడుతూ పేర్కొన్నారు. బ్యాలెట్ల ముద్రణ, పంపిణీని సియాటెల్కు చెందిన ఎలక్షన్ ట్రస్ట్ సంస్థ నిర్వహిస్తోందని తమ కమిటీ మంగళవారం ఉదయం సియాటెల్ పర్యటనకు బయల్దేరుతున్నామని, బ్యాలెట్లు ముద్రణ, తపాలా పూర్తి అయ్యే వరకు తాము అక్కడే ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు బోర్డు నిర్దేశంలో తాము నిబద్ధతగా ప్రయత్నిస్తున్నట్లు కనకంబాబు పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన బోర్డు సమావేశం గురించి వీరు ఇరువురు మాట్లాడారు. తానా సభ్యుల పట్టికలో స్వల్ప సంఖ్యలో(30-40) నూతన ఓట్లు గుర్తించామని, ఈ అంశాన్ని పరిశీలిస్తున్న తరుణంలోనే National Change Of Address (NCOA)తో తానా సభ్యుల పట్టిక సరిచూసే క్రమంలో ప్రాంతీయ ఆధారిత విభజనలో(Regional Segregation) లోపాలు ఉన్నట్లు పసిగట్టామని పేర్కొన్నారు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు తమ సమయం పట్టిందని ఐనంపూడి తెలిపారు. స్వల్ప సంఖ్యలో ఉన్న ఓటర్లను తొలగించి, ఆ పట్టికను పక్కన పెట్టి, దీనికి దారి తీసిన కారణాలను అన్వేషించేందుకు డా.జంపాల చౌదరి, డా. బండ్ల హనుమయ్య, వెన్నం మురళీలతో కూడిన ఓ అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు హరీష్ తెలిపారు. ఎలాంటి మార్పులకు లోను కాని ఏప్రిల్ 5న తొలిసారిగా ఎన్నికల కమిటీకి అందిన పట్టికనే సియాటెల్ సంస్థ ఎలక్షన్ ట్రస్ట్ చేత NCOA చేయించి వినియోగించవల్సిందిగా బోర్డులో నిర్ణయం తీసుకున్నట్లు వీరు తెలిపారు.
ఈ ఎన్నికల్లో పారదర్శకతకు తాము పెద్దపీట వేస్తున్నామని, ఏ చిన్న పొరపాటు జరిగినా దానిని లోతుగా పరిశీలించి సరిచేసి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు హరీష్-కనకంబాబులు వెల్లడించారు. తానా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సభ్యుల పేరు, భాగస్వామి పేరు, ఊరు, జిప్కోడ్, సభ్యత్వ ఐడీతో కూడిన పట్టికను కూడా శుక్రవారం తర్వాత అందజేస్తామని తెలిపారు.
Read – తానా ఎన్నికల ప్రక్రియ ఆగలేదు
##############