Politics

షర్మిల పార్టీ లాంఛనాలు పూర్తి

షర్మిల పార్టీ లాంఛనాలు పూర్తి

వైఎస్ షర్మిల పార్టీని వైఎస్సార్‌ జయంతి (జులై 8)నాడు ఏర్పాటు చేయబోతున్నామని పార్టీ సమన్వయకర్త వాడుక రాజగోపాల్ తెలిపారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లు, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులన్నీ ఎన్నికల సంఘం వద్ద పూర్తయినట్లు తెలిపారు. పార్టీ పేరుపై వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకి ఎటువంటి అభ్యంతరం లేదని.. ఆమె ఇచ్చిన లేఖను కూడా పార్టీ పేరుకు మద్దతుగా ఎన్నికల సంఘానికి అందజేశామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని రాజగోపాల్‌ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30న ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పేర్కొందని.. ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు రానందున అనుమతుల ప్రక్రియ పూర్తయిందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.