NRI-NRT

విజయవంతంగా తానా “ప్రఖ్యాత సాహితీవేత్తల వ్యక్తిగత కోణం” సాహితీ సదస్సు

విజయవంతంగా తానా “ప్రఖ్యాత సాహితీవేత్తల వ్యక్తిగత కోణం” సాహితీ సదస్సు

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాలంలో నిర్వహించిన “ప్రఖ్యాత సాహితీవేత్తలతో – ప్రత్యక్ష పరిచయాలు – ప్రత్యేక అనుభవాలు” అనే సాహిత్య కార్యక్రమం ఎంతో ఆసక్తిదాయకంగా సాగింది.

సాహిత్య లోకంలో లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు – జ్ఞానపీఠ్  అవార్డు గ్రహీత, పద్మభూషణ్ కవిసమ్రాట్ డా. విశ్వనాథ సత్యనారాయణ;
నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకుడు డా. ఆచార్య ఆత్రేయ;
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, జాతీయ ఉత్తమ గీత రచయిత, మహాకవి శ్రీశ్రీ;
సుప్రసిద్ధ సినీ గీత రచయిత, పద్మశ్రీ చేంబోలు “సిరివెన్నెల” సీతారామశాస్త్రిలు

…సృష్టించిన సాహిత్యం కాకుండా వారి వారి జీవితాలలోని అనేక మలుపులను, స్పూర్తిదాయకమైన వారి జీవనయానాన్ని వారితో ప్రత్యక్ష పరిచయాలున్న వివిధ ప్రముఖలు ఈ కార్యక్రమం ప్రత్యేకత. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు స్వాగాతోపన్యాసం చేశారు. వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ను అభినందించారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ సాహితీవేత్తల పేర్లు, వారు సృష్టించిన సాహిత్యం మాత్రమే మనకు తెలుస్తుంది గాని వారి వారి జీవితాలలో ఎదురైన అవరోధాలు, ఎదుర్కొన్న సవాళ్లు, వారి కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిళ్ళు, ఆర్ధిక ఇబ్బందులు లాంటివాటిని ఎన్నింటినో నిబద్ధతతో తట్టుకుని, సాహిత్య లోకంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న తీరు, వారు సృష్టించిన సాహిత్యం మానవాళికి ఎంతో స్పూర్తిదాయకం” అన్నారు. అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణలు విశ్వనాథతో గడిపిన రోజులను విశదీకరించారు. ప్రముఖ సినీ కథా రచయిత, పాటల రచయిత, దర్శకుడు జే.కె. భారవి ఆచార్య ఆత్రేయతో సాగిన 11 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. డా. వంగూరి చిట్టెన్ రాజు శ్రీశ్రీ తన భార్య సరోజతో పాటు హూస్టన్ లో తమ ఇంట్లో కొన్ని వారాల పాటు బసచేసినప్పుడు రచించిన సిప్రాలి అనే కవితా సంపుటి విశేషాలను నెమరవేసుకున్నారు. యర్రంశెట్టి సత్యారావు మాస్టారు సిరివెన్నెల జీవితాన్ని ఆవిష్కరించారు. కిరణ్ ప్రభ సిరివెన్నెల తో తనకున్న ఇరవై సంవత్సరాల పైగా ఆత్మీయ అనుబంధాన్ని సభికులతో పంచుకున్నారు.