Devotional

VIPలకు సుబ్బారెడ్డి విజ్ఞప్తి

VIPలకు సుబ్బారెడ్డి విజ్ఞప్తి

జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపి లు సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీ కి సహకరించాలని ఆయన కోరారు.
పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయం లో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు తిరుమల లో ని నందకం, వకుళ ఆథితి గృహాల్లోవసతి కల్పిస్తున్నామని, ఒక వేళ తిరుమలలో వసతి సరిపోక పోతే తిరుపతి లోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విఐపి ల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తుల ఎక్కువ సమయం దర్శనం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.