Politics

అప్పుల భారం ఉన్న టాప్‌-10 రాష్ట్రాల్లో ఏపీ..!

అప్పుల భారం ఉన్న టాప్‌-10 రాష్ట్రాల్లో ఏపీ..!

దేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్న టాప్‌-10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు రిజర్వుబ్యాంకు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్ధారించిన రుణ, ఆర్థికలోటు పరిమితులను రాష్ట్రం దాటేసిందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల భారం హద్దులు దాటినట్లు గురువారం విడుదలైన రిజర్వుబ్యాంకు బులిటెన్‌ పేర్కొంది. దేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్న టాప్‌-10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్ధారించిన రుణ, ఆర్థికలోటు పరిమితులను రాష్ట్రం దాటేసిందని వెల్లడించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వనంత అధికంగా జీఎస్‌డీపీలో 9% బ్యాంక్‌ గ్యారంటీలు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే 25 రోజుల పాటు స్పెషల్‌డ్రాయింగ్‌ ఫెసిలిటీ, 21 రోజులపాటు చేబదుళ్లకు వెళ్లినట్లు పేర్కొంది. ఇంత స్థాయిలో ఈ అవకాశాలను వాడుకున్న రాష్ట్రాల్లో ఏపీ సరసన తెలంగాణ, మణిపుర్‌, నాగాలాండ్‌ ఉన్నట్లు తెలిపింది. ఇదే నెలలో బహిరంగ మార్కెట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రూ.4వేల కోట్ల రుణం తీసుకోగా, తెలంగాణ మాత్రం ఏమీ తీసుకోలేదు. బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకోవడానికి తెలంగాణకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ రాష్ట్రం చేబదుళ్లు, ఓడీ, ప్రత్యేక డ్రాయింగ్‌ ఫెసిలిటీపై ఆధారపడింది. ఏపీ రూ.4వేల కోట్ల రుణంతో పాటు ప్రత్యేక డ్రాయింగ్‌ఫెసిలిటీ, చేబదుళ్ల సౌకర్యాన్నీ వాడుకొంది.

గత మేలో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌లలో 8%కి మించింది. 2021-22 బడ్జెట్‌ (సవరించిన అంచనాలు) ప్రకారం ఏపీ ఆదాయంలో 14% వడ్డీలకు వెళ్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలకు ఖర్చుచేసే మొత్తం రూ.27,541 కోట్లు జీఎస్‌డీపీలో 2.1%కి సమానం. రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో 14.1%, రాష్ట్ర సొంత ఆదాయంలో 30.3% ఇందుకోసం వెళ్తుంది. ఉచిత పథకాలకు పంజాబ్‌ (2.7%) తర్వాత అత్యధిక మొత్తం ఖర్చుచేస్తున్న రాష్ట్రం ఏపీ.బడ్జెటేతర రుణాల కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల నిష్పత్తి జీఎస్‌డీపీలో 2017-18లో 4.6% ఉండగా, 2018-19 నాటికి 6.2%, 2019-20లో 8.1% 2020-21లో 9%కి చేరింది. దేశంలో ఏ రాష్ట్రమూ 9% మేర గ్యారంటీలు ఇవ్వలేదు.