ఆర్ధిక మందగమనం నేపధ్యంలో సంక్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాలని సోషల్ మీడియా దిగ్గజం మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులను హెచ్చరించారు. హైరింగ్ ప్రక్రియను కుదించేందుకు కంపెనీ కసరత్తు సాగిస్తోందని చెప్పారు. ఇంజనీర్ల హైరింగ్ ప్రణాళికల్లో 30 శాతం కోత విధించనున్నట్టు జుకర్బర్గ్ వెల్లడించారు.టార్గెట్లను అందుకోలేని ఉద్యోగులపై వేటు తప్పదని ఉద్యోగులతో ప్రతివారం నిర్వహించే ప్రశ్నలు, సమాధానాల సెషనల్లో తేల్చిచెప్పారు. ఇక్కడ పనిచేయడం కుదరదని మీలో కొందరు మీ అంతట మీరు నిర్ణయించుకోవచ్చని అది తనకు సమ్మతమేనని అన్నారు. ఇటీవల ఎన్నడూ లేని విధంగా మెటా తీవ్ర ఆర్ధిక మందగమనాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. 2022లో ఇంజనీర్ల నియామక లక్ష్యాన్ని మెటా 6000-7000 వరకూ కుదించిందని జుకర్బర్గ్ వెల్లడించారు.
అంతకుముందు ఈ ఏడాది 10,000 మంది న్యూ ఇంజనీర్లను హైర్ చేయాలని మెటా భావించింది. ఇక ఆర్ధిక మందగమనం నేపధ్యంలో తక్కువ మంది ఇంజనీర్లనే రిక్రూట్ చేసుకుంటామని, పరిమిత బడ్జెట్లతో తక్కువ వృద్ధి రేట్లతో మెటా ముందుకెళుతుందని కంపెనీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ తెలిపారు.