Business

రియల్టీలోకి 14 శాతం పెరిగిన పెట్టుబడులు

రియల్టీలోకి 14 శాతం పెరిగిన పెట్టుబడులు

రియల్‌ ఎస్టేట్‌లో ఇనిస్టిట్యూషన్స్‌ పెట్టుబడులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 14 శాతం పెరిగి 2.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. కార్యాలయం, రిటైల్‌ విభాగాలు ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ వివరాలను కొలియర్స్‌ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది.
ఆఫీస్‌ స్పేస్‌ విభాగం 1,277 మిలిలియన్‌ డాలర్లను 2022 జనవరి–జూన్‌ మధ్య ఆకర్షించాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు 1,068 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 492 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన 77 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఆరు రెట్లకు పైగా వృద్ధి కనిపిస్తోంది.
డేటా కేంద్రాలు తదితర ప్రత్యామ్నాయ ప్రాపర్టీల విభాగంలోకి ఇనిస్టిట్యూషన్స్‌ పెట్టుబడులు 53 శాతం పెరిగి 370 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ విభాగంలోకి 241 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. మిశ్రమ వినియోగ ప్రాపర్టీల విభాగంలోకి 230 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అసలు ఏ మాత్రం పెట్టుబడులు రాలేదు.ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్‌ అసెట్స్‌ విభాగంలో మాత్రం ఇనిస్టిట్యూషన్స్‌ నుంచి పెట్టుబడులు 77 శాతం తగ్గి 180 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. నివాస ప్రాపర్టీల విభాగంలోకి సైతం 45 శాతం తగ్గి 86 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దేశీ ఇన్వెస్టర్ల వాటా క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఉన్న 13 శాతం నుంచి ఈ ఏడాది జూన్‌ నాటికి 38 శాతానికి పెరిగింది. అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్‌ 35 శాతం పెట్టుబడులను ఇనిస్టిట్యూషన్స్‌ నుంచి ఆకర్షించింది. ముంబై 11 శాతం, చెన్నై 10 శాతం సంపాదించాయి.