NRI-NRT

దశ దిశలా తెలుగు వెలుగు మన బాధ్యత

దశ దిశలా తెలుగు వెలుగు మన బాధ్యత

అమెరికాలోని హెర్న్‌డన్ ప్రాంతంలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమక్షంలో తెలుగు సాహిత్య, రంగస్థల వేదికల ఇష్టా గోష్ఠి కార్యక్రమం జరిగింది. భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల కళాకారులు గుమ్మడి గోపాల కృష్ణ ముఖ్య అతిథిగా, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, డాక్టర్ నరేన్ కొడాలి, ప్రముఖ మిమిక్రీ కళాకారులు రమేష్ గౌరవ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గుమ్మడి మాట్లాడుతూ, పద్యం ఒక్క తెలుగు భాషకు, తెలుగు నేలకూ సొంతమని.. తెలుగు భాషలో అక్షర సేద్యం చేసిన కవులు, కళాకారులను గుర్తుచేశారు. సత్య హరిశ్చంద్ర, కృష్ణ తులాభారం పద్య నాటకంలో కొన్ని పద్యాలను సందర్భోచితంగా ఆలపించి నేటికీ రంగస్థలం గొప్పతనాన్ని, తెలుగు కళా వైభవాన్ని అమెరికాలో ఆదరిస్తున్న, ముందుకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులను అభినందించారు.
07152022220334n62
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ .. అమ్మ భాష మాధుర్యాన్ని, తెలుగు భాష విశిష్టతను ఈ తరం పిల్లలకు కూడా ఆ భాష గొప్పదనాన్ని, మన సంస్కృతిని అందిస్తున్న అన్ని తెలుగు సంఘాలకు, ప్రవాస పెద్దలకు అభినందనలు తెలిపారు. మాతృ భాష పరిరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యతని తెలిపారు. తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. కళాకారుల పుట్టిల్లు కడప జిల్లా నుంచి వచ్చిన తనకు తెలుగు భాష పట్ల అభిమానం ఉందన్నారు. అలాగే అమెరికాలో కూడా రాబోయే రోజుల్లో తెలుగు భాషను విస్తృత పరచి మరింత ఉన్నతమైన కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు. హాజరైన అతిథులను, పెద్దలను మిమిక్రీ కళాకారులు ‘రమేష్’ .. పలువురు ప్రముఖుల గొంతును అనుకరించి ఆకట్టుకున్నారు. మాతృభాష గొప్పతనం మాటల్లో చెప్పలేనిది.. విధిగా మనం తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలని ఆదరించాలని విజ్ఞప్తి చేసారు. చివరిగా.. హాజరైన తల్లిదండ్రులు అందరూ, తెలుగు సంఘాల పెద్దలకు, అతిథులను దుశ్శాలువాలుతో సత్కరించి.. తమ హర్షాన్నివ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు రాజు, యువ సిద్ధార్థ్ బోయపాటి, డాక్టర్ లిఖిత్, డాక్టర్ నాగ శంకర్, చనుమోలు అనిల్, మన్నవ వెంకటేశ్వర్రావు, వీర్రాజు, రామకృష్ణ రెడ్డి, ప్రతాప రెడ్డి, సత్యనారాయణ రాజు పలువురు పాల్గొన్నారు.
07152022220403n17