Movies

త్వరలోనే కలుద్దాం

త్వరలోనే కలుద్దాం

యువ తారలకు స్ఫూర్తినిచ్చే సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ కొనసాగిస్తున్నది సౌత్‌ స్టార్‌ త్రిష. ఇటీవల ‘పొన్నియన్‌ సెల్వన్‌ 1’ ఘన విజయంతో ఆమె క్రేజ్‌ మరింత పెరిగింది. ప్రస్తుతం తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నదీ తార. సినిమాలతో పాటు డిజిటల్‌ ఎంట్రీకి కూడా త్రిష సిద్ధమైంది. ఆమె నటిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ‘బృందా’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సిరీస్‌ తెలుగులో తెరకెక్కి మిగతా దక్షిణాది భాషల్లోకి అనువాదం కానుంది. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు సూర్య వంగల ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా టైటిల్‌ రోల్‌లో కనిపించనుంది త్రిష. ‘బృందా’ పార్ట్‌ 1 షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా త్రిష సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. ‘బృందా షూటింగ్‌ పూర్తిచేశాం. చిత్రీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను’ అంటూ ఇన్‌స్టాలో తెలిపింది. ప్రస్తుతం త్రిష ఖాతాలో ‘సతురంగ వేైట్టె 2’, ‘ద రోడ్‌’, ‘పొన్నియన్‌ సెల్వన్‌ 2’, ‘రామ్‌’ పార్ట్‌ 1 చిత్రాలున్నాయి.