Politics

2024లో భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు కెసిఆర్ అడుగులు : అఖిలేశ్ యాదవ్​

2024లో భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు కెసిఆర్ అడుగులు : అఖిలేశ్ యాదవ్​

న్యూఢిల్లీ : వచ్చే లోక్​సభ ఎన్నికలలోపు బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు బిహార్ సీఎం నీతీశ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు కృషి చేస్తున్నారని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. మైన్​పురి ఎంపీగా గెలుపొందిన డింపుల్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి అఖిలేశ్ యాదవ్​ హాజరయ్యారు. 2024 లోక్​సభ ఎన్నికలలోపు బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోందని సమాజ్​వాదీ పార్టీ అధినేత, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. అధికార బీజేపీ కి ప్రత్యామ్నాయాన్ని రూపొందించే పనిలో ప్రతిపక్ష నాయకులు నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, నిరుద్యోగం పెరుగుదల సహా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్​ ఇచ్చిన హక్కులన్నీ హరించుకుపోతున్న సమయంలో ప్రత్యామ్నాయం ఏర్పడాలని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. బిహార్ సీఎం నీతీశ్ కుమార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగానే కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్​ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన వెంటనే ఆమె కాంగ్రెస్‌నేత సోనియా గాంధీ పాదాలకు నమస్కారం చేశారు. డింపుల్‌యాదవ్‌ లోక్‌సభలో హిందీలో ప్రమాణ స్వీకారం చేయగా అఖిలేశ్‌ యాదవ్‌ సందర్శకుల గ్యాలరీలో కూర్చుని వీక్షించారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో మైన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఇందులో పోటీ చేసిన ములాయం కోడలు డింపుల్‌ యాదవ్‌ 2 లక్షల 88 వేల ఓట్లకుపైగా భారీ మెజార్టీతో గెలుపొందారు.