Politics

ఏపీ ఎన్జీవో నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య మాటల యుద్ధం

ఏపీ ఎన్జీవో నేతలు,  ప్రభుత్వ ఉద్యోగుల మధ్య మాటల యుద్ధం

ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ స్పందించారు.

ఉద్యోగుల సర్వీసులను నియంత్రించే అధికారం గవర్నర్‌కే ఉంది కాబట్టి ఆయనను కలిశామని స్పష్టం చేశారు.

వేరే సంఘం పేరు కానీ, ఇతర సంఘం నేతల ప్రస్తావన కానీ చేయలేదన్నారు.

ఉద్యోగుల వేతనాలు ఒకటో తేదీనే చెల్లించాలని చట్టం ఉందన్న ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు.. దానిని నిరూపించాలని డిమాండ్‌ చేశారు.

చట్టం ఇప్పటికే ఉండి ఉంటే తాము క్షమాపణ కోరతామని సూర్యనారాయణ తెలిపారు.

ఒకటో తేదీన జీతాలు చెల్లించాలన్న జీవోలు ఉన్నాయే తప్ప.. చట్టం లేదన్నారు.

తాము రేపట్నుంచి సమ్మె చేయడానికి సిద్ధంగా లేమని, కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

సమ్మెకు వెళ్తామని తాము చెప్పలేదన్న ఆయన..

తమ సంఘం గుర్తింపును రద్దు చేయమని ఫిర్యాదు చేసే హక్కు వారికి ఉంటుందన్నారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దొడ్డిదారిన గుర్తింపు తెచ్చుకోలేదని పేర్కొన్నారు.

జీతాల విషయంలో చట్టం చేయమంటే.. సంఘం గుర్తింపును రద్దు చేయమంటారా? అని ప్రశ్నించారు.

తమ వెనుక లక్షలాది మంది ఉద్యోగుల మనోభావాలున్నాయని వెల్లడించారు.

గతంలో తమ సంఘం గుర్తింపుపై ఫిర్యాదులు చేశారని, కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు.

ఏపీఎన్జీవో సంఘం నేతలు ఇచ్చిన ఫిర్యాదు సరికాదంటూ స్వయంగా సీఎం జగన్‌ సంతకం చేసి.. తమకు గుర్తింపు ఇచ్చారన్నారు.

అడ్డూ అదుపు లేకుండా ఏపీ ఎన్జీవో సంఘం నడుస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు మండిపడ్డారు.

రాజకీయానికి తొలిమెట్టు అన్నట్టు ఏపీ ఎన్జీవో సంఘం మారిందని ఎద్దేవా చేశారు.

ఈ సంఘంలో కేవలం నాన్‌గెజిటెడ్‌ స్థాయి వాళ్లే ఉంటారని, తమ సంఘంలో అటెండర్‌ నుంచి అధికారుల వరకు అందరూ ఉన్నారని తెలిపారు.

తోటి సంఘం నేతను ఖబడ్దార్‌ అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూర్యనారాయణ ఖబడ్దార్.. ఆస్కార్ రావు కాస్కో.. దమ్ముంటే చూస్కో అంటారా? అని ధ్వజమెత్తారు.

ఉద్యోగుల సంక్షేమం కోసం పని చేస్తారా.. కుస్తీ పోటీలు పడతారా అని నిలదీశారు.

ఏపీ ఎన్జీవో నుంచి సగం మంది ఉద్యోగులు తమ సంఘంలో చేరారని తెలిపారు.

గవర్నర్ ఏమైనా దేశ ద్రోహా… ఆయన దగ్గరకు వెళ్లడం తప్పా? అని ప్రశ్నించారు.

రాజ్యాంగ అధినేతగా ఆయన్ను కలిసి ఉద్యోగుల ఇబ్బందులు నివేదించామన్నారు.

ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడాలి తప్ప కుస్తీ పోటీల్లో కాదని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.