WorldWonders

శ్రీమహాలక్ష్మీ సహిత కుబేర- చిత్రలేఖల ఆలయం…

శ్రీమహాలక్ష్మీ సహిత కుబేర- చిత్రలేఖల ఆలయం…

దేశంలో దేవాలయాలకు కొదువలేదు. కానీ కుబేర ఆలయం మాత్రం అరుదు. అటువంటి కుబేర ఆలయ విశేషాలు తెలుసుకుందాం.. కుబేరుడు పేరు వినని వాళ్ళు వుండరంటే అతిశయోక్తి కాదు. అష్టైశ్వర్య ప్రదాయిని లక్ష్మీ దేవి అయితే దానిని మనదాకా అందించేవాడు కుబేరుడు యక్షులకు నాయకుడు. కుబేరుని పూజిస్తే సిరులు కలుగుతాయి. మరి ఆ కుబేరుణ్ణి లక్ష్మీ నారాయణులతో సహా పూజిస్తే తప్పక ధనప్రాప్తి, ఐశ్వర్యం లభిస్తాయని పండితుల అభిప్రాయం.అయితే దేశంలో లక్ష్మీ ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ, లక్ష్మీదేవితో కుబేరుడు అతనిభార్య చిత్రలేఖ కలసి ఉన్న ఆలయాలు చాలా అరుదు. అయితే తమిళనాడురాష్ట్రంలో చెన్నై నుండి చెంగల్ పట్టు వెళ్లే దారిలో రత్న మంగళం అనే ఊరిలో కుబేరుడు, లక్ష్మీదేవిల ఆలయం ఉంది. ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

కుబేరుడి పురాణ కధ

బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణాల ప్రకారం పులస్త్యుడి కొడుకైన విశ్వావసు, ఇళల కుమారుడు వైశ్రవణుడు, ఆయనే కుబేరుడు. విశ్వావసు, కైకసిల కుమారుడు రావణుడు. కుబేరుడు లంకకు మహారాజు కానీ రావణాసురుడు తన రాక్షస బలంతో కుబేరుడుని రాజ్య భ్రష్ఠుడుని చేసి లంకనుండి బలవంతముగా తరిమివేశాడు. కుబేరుడు తన తండ్రి సలహాతో లక్ష్మీ నారాయణుల సువర్ణ విగ్రహాలను ప్రతిష్టించి లక్ష్మీ నారాయణ వ్రతం చేస్తాడు. ఆ రోజు అక్షయ తృతీయ. లక్ష్మీదేవి ప్రత్యక్షమయి ఆయనని ధనాధిపతిని చేసింది. ప్రజలకు వారివారి యోగ్యత ప్రకారం సంపదను ప్రసాదించే బాధ్యత అప్పజెప్పింది. అంతేకాదు, కలియుగంలో తమ ప్రతిమలతోబాటు కుబేరుడి ప్రతిమకూడా పెట్టి పూజించి తర్వాత ఆ ప్రతిమని బ్రాహ్మణుడికి దానం చేసినవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వరం కూడా ఇచ్చింది. కుబేరుడు లోకంలో వున్న ధనానికంతా అధిపతి. లక్ష్మీదేవి సాక్షాత్ ఐశ్వర్య స్వరూపం.ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్య స్వరూపమైన శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించినవారికి వారి అనుగ్రహం వుంటుంది.

ఆలయ విశేషాలు

ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఎడమప్రక్క గుండ్రంగా ప్రతిష్టించబడిన షోడశ (16) గణపతులను చూడవచ్చు. పక్కనే నవ గ్రహాలు భార్యలతో సహా కొలువు తీరారు. ప్రదక్షిణ మార్గంలో వెళ్తుంటే గర్భ గుడి బయట గోడలమీద ఒక ప్రక్క బ్రహ్మ, సరస్వతులు, వెనుక స్వర్ణాకర్షణ భైరవుడు (నాకర్ధం అయినంతమటుకూ ఈయన క్షేత్ర పాలకుడు), ఇంకో ప్రక్క వేంకటేశ్వరస్వామి విగ్రహాలున్నాయి. ప్రక్కనే లాఫింగ్ బుధ్ధా, కుమార స్వామి వగైరా విగ్రహాలున్నాయి.

గర్భాలయంలో కుబేరుడు, ఆతనిభార్య చిత్రలేఖల విగ్రహాలు, వాటి వెనుక వారికి ఐశ్వర్యం ప్రసాదిస్తూ లక్ష్మీదేవి విగ్రహం వుంటాయి. కుబేరుడికి వెండి తలపాగా. విగ్రహాలన్నింటికీ వెండి తొడుగులు. కరెన్సీ నోట్ల హారాలు. మరి లక్ష్మీ కుబేరుల ఆలయం కదండీ. ఆలయం లోపలే విక్రయశాలలు. వాటిలో ఒక దానిలో పూర్వం వచ్చే చిల్లి కాణీ ఆకారంలో వున్న ఒక నాణేనికి ఎఱ్ఱ దారం కట్టి 30 రూ. లకి అమ్ముతున్నారు. అది తీసుకుని లాఫింగ్ బుధ్ధా ఎడమ చేతిలో పెట్టి, తర్వాత ఆయన బొజ్జమీద తాకించి పర్సులో పెట్టుకుంటే అదృష్టం వారిదేనట. ఇంకో విశేషమేమిటంటే కుబేరుడికి ఆకుపచ్చ రంగంటే ప్రీతి. అందుకే, అక్కడ రక్షగా అమ్మే దారాలే కాదు కుంకుమ కూడా ఆకుపచ్చ రంగే.