నేటి నుంచి సోమవారం వరకు తెలంగాణలో ఎండలు మండిపోనున్నాయి.
ఈ మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది.
అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు, జూన్ ఒకటో తేదీ నుంచి 5 రోజులపాటు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.
వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండడంతోపాటు పొడి వాతావరణమే ఇందుకు కారణమని తెలిపింది.
నల్గొండ జిల్లా దామచర్లలో నిన్న 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.