అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు మన దేశంలో తయారీ చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. కరోనా పరిణామాల్లో కఠిన ఆంక్షల కారణంగా చైనాలో ఉత్పత్తి తగ్గడం, అమెరికాతో ఆ దేశానికి ఉన్న వివాదాల వల్ల చైనా నుంచి ఉత్పత్తిలో కొంతమేరకు ఇతర దేశాలకు తరలించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే యాపిల్ సంస్థ ఐఫోన్ల తయారీని మనదేశంలోనూ చేపట్టింది. తాజాగా గూగుల్ సైతం అదే బాటలో నడుస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. భారత్లో పిక్సల్ స్మార్ట్ఫోన్ల అసెంబ్లింగ్ కోసం సరఫరాదార్లను గూగుల్ అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. భారత్కు చెందిన లావా ఇంటర్నేషనల్, డిక్సన్ టెక్నాలజీస్ ఇండియాతో పాటు ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్నకు చెందిన దేశీయ యూనిట్ భారత్ ఎఫ్ఐహెచ్తోనూ గూగుల్ చర్చలు జరుపుతున్నట్లు కొంత మంది వ్యక్తులను ఉటంకిస్తూ పేర్కొంది. ఈ కంపెనీలన్నీ ఉత్పత్తి ఆధారిత ఆర్థిక ప్రోత్సాహకాల(పీఎల్ఐ)ను కేంద్రం నుంచి అందుకుంటున్నాయి.