Politics

వివేకా కేసులో A-8 నిందితుడిగా అవినాష్

వివేకా కేసులో A-8 నిందితుడిగా అవినాష్

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు చేసిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. హత్యకు డబ్బు సమకూర్చిందెవరో తేలాల్సి ఉందన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ కేసులో సీబీఐ కోర్టుకు అనుబంధ అభియోగపత్రం సమర్పించింది. ఇందులో A-6గా ఉదయ్‌కుమార్‌రెడ్డి, A-7గా వై.ఎస్‌.భాస్కరరెడ్డి, A-8గా వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిలను పేర్కొంది. వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్‌లను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది.

మాజీ మంత్రి వివేకా హత్యకేసులో దర్యాప్తును జూన్‌ 30లోగా పూర్తిచేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. దీంతోపాటు ఇప్పటివరకూ నమోదుచేసిన సాక్షుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను జత చేసింది. అభియోగపత్రాన్ని, అందులో పేర్కొన్న అభియోగాలను, ఆధారాలను పరిశీలించాక.. న్యాయమూర్తి దాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుని నిందితులకు సమన్లు జారీచేయాల్సి ఉంది. ఈ కేసులో నిందితులైన గంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కరరెడ్డిలను చంచల్‌గూడ జైలునుంచి తీసుకువచ్చి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. వీరందరికీ జడ్జి సీహెచ్‌. రమేశ్‌బాబు జులై 14 వరకు రిమాండును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసినా.. ఇంకా దర్యాప్తు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వివేకా చనిపోయే ముందు రాసిన లేఖలో నిగూఢ వేలిముద్రలనూ గుర్తించడంలో భాగంగా లేఖను కోర్టు నుంచి సీబీఐ తీసుకుని, దిల్లీ ఎఫ్​ఎస్​ఎల్​కు పంపింది. నిన్‌హైడ్రిన్‌ పరీక్ష ద్వారా వేలిముద్రలను గుర్తించాలని కోరింది. ఎం.వి.కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాష్‌లను అనుమానితులుగా పేర్కొంది. వీటన్నింటిపై స్పష్టత నిమిత్తం దర్యాప్తును మరికొంతకాలం కొనసాగించే అవకాశాలున్నాయి. తదుపరి దర్యాప్తులో సమాచారం వెల్లడైతే సమర్పిస్తామంటూ కోర్టును కోరే అవకాశం ఉంది. వివేకా హత్యకు డబ్బు సమకూర్చింది ఎవరు, ఆ డబ్బు ఎక్కడ ఉందన్న వివరాలు తేలాల్సి ఉంది.

వివేకా హత్య వెనుక జరిగిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు విశ్వసనీయవ వర్గాల ద్వారా తెలిసింది. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని.. సాక్ష్యాలు విధ్వంసం చేయడంలో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి ఉన్నట్లు తేలిందని సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం. సాక్ష్యాల విధ్వంసం సమయంలో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి ఉన్నారని వెల్లడించినట్లు తెలిసింది. అవినాష్‌రెడ్డి డ్రాయింగ్‌ రూం లోపల, లాన్‌ ప్రాంతంలో ఉండగా, శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డిలతో కలిసి భాస్కరరెడ్డి బెడ్‌రూంలో ఉంటూ సాక్ష్యాలు విధ్వంసం చేయించారని సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం.

హత్య పథకం అమలుకు అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి నగదు సమకూర్చుతారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ వెల్లడించినట్లు తెలిసింది. అవినాష్‌రెడ్డి ఇతరులతో చర్చించిన తర్వాత సీఐ శంకరయ్యకు ఫోన్‌ చేసి బందోబస్తుకు పోలీసులను పంపాలని చెప్పి.. గుండెపోటుతో మృతిచెందినట్లు ప్రకటించడం కుట్రలో భాగమేనని సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం. సీఐకి కేసు నమోదు చేయవద్దని, పోస్టుమార్టం అవసరం లేదని మొదట చెప్పారని సీబీఐ వెల్లడించినట్లు తెలుస్తోంది. తర్వాత సునీత , తదితరులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేశారని సీబీఐ వెల్లడించినట్లు తెలిసింది. అవినాష్‌రెడ్డి సూచనల మేరకు అస్పష్టమైన వివరాలతో గాయాలు, రక్తపుమడుగులో మృతదేహం పడి ఉన్నా.. కనీసం వాటి ప్రస్తావన లేకుండా ఎం.వి.కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం.దర్యాప్తులో భాగంగా అనుమానితుల కాల్‌ డేటా, హత్య జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీ, గూగుల్‌ టేక్‌ ఔట్, కాల్‌డేటా రికార్డులు, అనుమానితుల ఫోన్ల నుంచి సేకరించిన డేటాతో పాటు వివేకా ఇంట్లోని రౌటర్‌ నుంచి వై-ఫై లాగ్స్, ఏఐఐఎంఎస్‌ నిపుణుల నుంచి అభిప్రాయాలతో సహా భారీ ఎత్తున ఎలక్ట్రానిక్‌ డేటా సేకరించి పరిశీలించామని సీబీఐ తెలిపింది. దిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి గూగుల్‌ టేక్‌ ఔట్‌ గురించి అందిన నివేదికలో సాక్ష్యాల ధ్వంసం, హత్య వెనుక కుట్రలో ఉదయ్‌కుమార్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిల పాత్ర ఉందని పేర్కొంది.

వివేకా హత్య తర్వాత 15 తేదీ తెల్లవారుజామున ఒంటి గంట 58 నిమిషాలకు అవినాష్‌ ఇంట్లో సునీల్‌యాదవ్‌ ఉన్నట్లు గూగుల్‌ ద్వారా తేలినట్లు వివరించింది. గూగుల్‌ టేక్‌ఔట్‌ ప్రకారం సునీల్‌యాదవ్‌ ఈ సమయంలో 6 గంటల15 నిమిషాల నుంచి 33 నిమిషాల మధ్య అవినాష్‌రెడ్డి ఇంట్లో ఎదురు చూస్తున్నాడని తెలిపింది. కత్తి తీసుకురావడానికి కదిరి వెళ్లిన దస్తగిరి కోసం ఎదురు చూస్తున్నట్లు దర్యాప్తులో తెలిందని వివరించింది. అవినాష్‌రెడ్డి ఇంటికి ఉదయ్‌కుమార్‌రెడ్డి 6 గంటల 53నిమిషాలకు వచ్చి 8 గంటల7 నిమిషాల వరకు ఉన్నాడని తెలిపింది. శివశంకర్‌రెడ్డి 15న 8 గంటల 25నిమిషాల నుంచి 12 గంటల45 నిమిషాల వరకు పులివెందుల స్టేషన్‌ సమీపంలో ఉన్నట్లు గూగూల్‌ టేక్‌ఔట్‌ ద్వారా వెల్లడైందని పేర్కొంది. అంటే ఫిర్యాదు సమయంలో కృష్ణారెడ్డితో పాటు ఉన్నట్లు తెలుస్తోందని తెలిపింది.

కడప జిల్లా రాజకీయాల్లో వివేకా చురుకైన పాత్ర పోషిస్తుండటంతో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి రాజకీయ విభేదాలతో కక్ష పెంచుకుని ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నడం ప్రారంభించారని సీబీఐ తెలిపింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల డివిజన్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో గెలవడం వైసీపీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. గెలుస్తానన్న ధీమాతో వివేకా తన డివిజన్‌ను వదిలి ఇతర డివిజన్లపై దృష్టి సారించారని.. పులివెందుల వ్యవహారాలను అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి పర్యవేక్షిస్తూ వివేకా ఓటమికి కారకులయ్యారని తెలిపింది. వెన్నుపోటు గురించి తెలుసుకున్న వివేకా ఆగ్రహం వ్యక్తం చేసి, గంగిరెడ్డిని పలుమార్లు తిట్టారని పేర్కొంది. ఎంపీ టికెట్‌ దక్కకుండా వివేకా ప్రయత్నించారని అవినాష్‌ కక్ష పెంచుకున్నారని.. దీంతో నేరచరిత్ర ఉన్న శివశంకర్‌రెడ్డి ద్వారా హత్యకు కుట్రపన్నినట్లు ప్రాసంగిక సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయని అభియోగపత్రంలో సీబీఐ తెలిపింది.