Business

స్టూడెంట్స్ కి హైదరాబాద్ మెట్రో సూపర్‌ పాస్‌

స్టూడెంట్స్ కి హైదరాబాద్ మెట్రో సూపర్‌  పాస్‌

విద్యార్థుల సౌకర్యార్థం శనివారం నుంచి సూపర్‌ సేవర్‌ స్టూడెంట్‌ పాస్‌-2023 అమల్లోకి తీసుకొచ్చామని మెట్రో రైల్‌ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 1998 ఏప్రిల్‌ 1 తర్వాత పుట్టిన విద్యార్థులందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులని తెలిపారు. ఈ ఆఫర్‌ కింద విద్యార్థులు 20 ట్రిప్పులకు మాత్రమే నగదు చెల్లించి అన్ని ఫేర్‌ జోన్‌లలో 30 ట్రిప్పుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా కొత్త బ్రాండెడ్‌ స్మార్ట్‌కార్డు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.  ఒక విద్యార్థికి ఒక స్మార్ట్‌ కార్డు మాత్రమే జారీ చేస్తారని, అది కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజుల వరకు చెల్లుబాటవుతుందన్నారు. ఈ ఆఫర్ జూలై 1 నుంచి 31 మార్చి 2024 వరకు అందుబాటులో ఉంటుందని వివరించారు.

విద్యార్థులు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు జేఎన్‌టీయూ కాలేజ్‌, ఎస్‌ఆర్ నగర్‌, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్‌, దిల్‌సుఖ్‌నగర్, నారాయాణగూడ, నాగోల్‌, పరేడ్ గ్రౌండ్, బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌లలో పాస్ లు కొనుగోలు చేయాలని సూచించారు. సూపర్ సేవర్ మెట్రో పాస్‌లను కొనుగోలు చేసిన విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో రైలుతో అనుసంధానం గల రిలయన్స్ ట్రెండ్‌, 24 సెవెన్ కన్వీనియన్స్ స్టోర్‌లు తదితర వాణిజ్య సంస్థల ద్వారా రాయితీ కూపన్లు కూడా పొందవచ్చని మెట్రో అధికారులు తెలిపారు.