DailyDose

మరోసారి డేంజర్ మార్క్ దాటిన యమునా నది

మరోసారి డేంజర్ మార్క్ దాటిన యమునా నది

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతాన్ని గత కొద్దిరోజులుగా వరణుడు వణికిస్తున్నాడు. దిల్లీలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో ఆ రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా దిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చడం ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా.. ఇవాళ ఉదయానికి నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది.కేంద్ర జల కమిషన్‌ సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల సమయానికి దిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు)ని దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరి 208.66 మీటర్లుగా నమోదవడంతో దిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే.