Politics

పోలవరం వద్ద చంద్రబాబు సెల్ఫీ సవాల్

పోలవరం వద్ద చంద్రబాబు సెల్ఫీ సవాల్

ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వానికి సెల్పీ చాలెంజ్ విసిరారు. చింతలపూడి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలంటూ సవాల్ విసిరారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో చింతలపూడి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టిందని…అంతేకాదు టీడీపీ హయాంలోనే రూ. 2289 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. చింతలపూడి ప్రాజెక్టు వల్ల ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు రూపకల్పన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 53 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించేలా ప్రణాళిక చేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రాజెక్టును వైసీపీ అటకెక్కించడంపై ప్రశ్నిస్తూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిపై చంద్రబాబు పట్టిసీమ, పోలవరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వాకం వల్ల ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందని ఆరోపించారు. 2004 నుంచి పాలకుల నిర్లక్ష్యానికి ప్రాజెక్టు బలైందని అన్నారు. 2004లో మధుకాన్‌, శీనయ్య సంస్థలకు టెండర్లు దక్కాయన్న చంద్రబాబు కానీ కక్ష సాధింపు చర్యలతో అప్పటి పనులు రద్దు చేశారని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం కాలువ పనులకు ప్రాధాన్యత ఇచ్చారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో 2004 నుంచి 2014 వరకు ఐదు శాతం పనులే జరిగాయని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తి చేసేదానిపై 2021 నుంచి వరుసగా అనేక తేదీలు ప్రకటిస్తూ వచ్చారని కానీ ఇప్పటికీ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. అసలు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థాయికి ఈ ప్రభుత్వం చేరుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.