Business

బ్యాంక్ లోన్ తీసుకునే వారికి శుభవార్త

బ్యాంక్ లోన్ తీసుకునే వారికి శుభవార్త

అప్పు చేసి పప్పు కూడు అనే సామెత విన్నారా.. భూమి పై పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఓ సమయంలో పప్పు కూడు కోసం తప్పకుండా అప్పు చేసే ఉంటారు. రుణం తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా రావచ్చు. తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేస్తే వడ్డీలు తడిసిమోపెడు అవుతుంటాయి. దీంతో పలు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. కానీ బ్యాంకులు సైతం ప్రాసెసింగ్ చార్జీలు, వడ్డీలంటూ ఖాతాదారులను అందిన కాడికి పిండుకుంటున్నాయి. వీటన్నింటికి మధ్య ఓ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో తన కస్టమర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ బ్యాంకులో లోన్ తీసుకునే వాళ్లకు ప్రాసెసింగ్ ఫీజు లేదంటూ శుభవార్తను అందించింది. దీంతో రుణ గ్రహీతలకు పెద్ద ఊరట లభించనుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన ఖాతాదారులు తీసుకునే రుణంపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వడ్డీ రేటును కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) గృహ, కారు రుణాలపై వడ్డీ రేటును 0.20 శాతం వరకు తగ్గించింది. దీంతోపాటు ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ మినహాయింపుతో గృహ రుణాలు ఇప్పుడు 8.60 శాతానికి బదులుగా 8.50 శాతానికి అందుబాటులో ఉంటాయి. మరోవైపు కారు రుణాన్ని 8.90 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గించారు.

కొత్త రేట్లు ఆగస్టు 14 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక ప్రకటనలో తెలిపింది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల మినహాయింపు ప్రయోజనాలు కస్టమర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయని బ్యాంక్ తెలిపింది. ఖాతాదారులు కూడా బ్యాంకు నుండి రుణాలు తీసుకోవడానికి ఆకర్షితులవుతారు. గత ఏడాది కాలంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేరు ధరలో పెరుగుదల ఉంది. ఆగస్టు 11న ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేరు ధర రూ.37.65 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.38.8, 52 వారాల కనిష్టం రూ.16.90. ఆగస్టు 11వ తేదీన ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధరను తాకింది.