Business

ల్యాప్స్‌ పాలసీదారులకు ఎల్‌ఐసీ శుభవార్త

ల్యాప్స్‌ పాలసీదారులకు ఎల్‌ఐసీ శుభవార్త

జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి విలువైన పాలసీదార్ల కోసం నిలిచిపోయిన (ల్యాప్స్‌డ్‌) పాలసీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 2022-23లో మొదటి ఏడాది ప్రీమియం ఆదాయంలో 62.58 శాతం మార్కెట్‌ వాటాతో పరిశ్రమలో అగ్రస్థానాన్ని ఎల్‌ఐసీ కొనసాగించింది. దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ నెట్‌వర్క్‌తో వృద్ధి జోరు కొనసాగిస్తామని తెలిపింది. 2023 మార్చి 31కు ఎల్‌ఐసీ మొత్తం 27.74 కోట్ల పాలసీలకు సేవలు అందిస్తోంది. 1956లో రూ.5 కోట్ల ప్రారంభ మూలధనంతో ప్రయాణం మొదలుపెట్టిన ఎల్‌ఐసీ.. 2023 మార్చికి నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.43.97 లక్షల కోట్లుగా ఉన్నాయి. సంస్థ 8 జోనల్‌ కార్యాలయాలు, 113 డివిజనల్‌ కార్యాలయాలు, 74 ఖాతాదారు జోన్‌లు, 2048 శాఖలు, 1580 శాటిలైట్‌ కార్యాలయాలు, 13.47 లక్షల ఏజెంట్‌లతో ఖాతాదారులకు సేవలందిస్తోంది.