Business

శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు నుండి శుభవార్త

శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు నుండి శుభవార్త

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో పనులను క్షేత్రస్థాయిలో మొదలెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారంలో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. గతంలో 13వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన ముగియడంతో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సైక్లింగ్‌ ట్రాక్‌ ప్రారంభోత్సవం, విమానాశ్రయ మెట్రో పనులకు కొబ్బరికాయ కొట్టడం ఈ నెలలోనే వరుసగా ఉండనున్నాయి. విమానాశ్రయ మెట్రో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. పనులకు గతేడాది డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.6250 కోట్ల అంచనా ప్రాజెక్ట్‌ ఇది. మెట్రో పనుల వరకు ఈపీసీ పద్ధతిలో గ్లోబల్‌ టెండర్లను పిలిచారు. రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎల్‌1గా నిలిచిన సంస్థ వివరాలతో ప్రభుత్వానికి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) నివేదిక సమర్పించింది.

ప్రభుత్వ ఆమోదమే తరువాయి.. టెండర్‌ ప్రక్రియ ముగిసి నెలన్నర దాటింది. ఎల్‌1గా నిలిచిన సంస్థను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపినట్లు అధికారులు చెబుతున్నారు. సర్కారు ఆమోదం అనంతరం విమానాశ్రయ మెట్రో పనులను సదరు సంస్థ చేపట్టనుంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌ అయినప్పటికీ కేంద్రం నుంచి కూడా సూత్రప్రాయ అనుమతి పొందాల్సి ఉంటుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేంద్రానికి లేఖ రాసింది.

డిపో కోసం భూమిని కేటాయించిన జీఎంఆర్‌.. ఎక్స్‌ప్రెస్‌ మెట్రో డిపోని విమానాశ్రయంలోనే నిర్మించబోతున్నారు. ఇందుకోసం అవసరమైన 48 ఎకరాలను మెట్రోరైలు సంస్థకు అప్పగించాలని పురపాలక శాఖ మంత్రి గత నెలలో ఆదేశించారు. ఈ మేరకు జీఎంఆర్‌ సంస్థ ఇటీవలనే ఆ భూమిని మెట్రోకి అప్పగించింది. డిపో డిజైన్‌పై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ ప్రకారం మెట్రో ప్రాజెక్ట్‌ దక్కించుకున్న సంస్థ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది.

ఐదేళ్ల ఎదురుచూపులు.. విమానాశ్రయంతో నగరానికి మెట్రో అనుసంధానం ఉండాలనేది కేసీఆర్‌ ఆలోచన. ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో పొడిగించాలని సూచించారు. ఈ మేరకు 2018-19లో దిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) రూపొందించింది. ఆ తర్వాత రెండేళ్లకు సర్కారు దీనికి ఆమోదం తెలిపింది. గతేడాది శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది టెండర్ల ప్రక్రియ ముగిసింది. నిర్మాణ పనులు మొదలెట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఐదేళ్లు పట్టింది.