Politics

మీ ఓటు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది!

మీ ఓటు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది!

కందుకూరులో మెడికల్‌ కళాశాల రావడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషే కారణమని సీఎం కేసీఆర్‌ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం ఆమేనని చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చూట్టూ త్వరలోనే పైప్‌లైన్‌ రాబోతోందని, అది అందుబాటులోకి వస్తే మహేశ్వరం ప్రజలకు తాగునీటి సమస్యే ఉండదని తెలిపారు. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌ తీరు వంటలు చేసి పెట్టండి మేము వడ్డిస్తామన్న చందంగా ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నందునే రాష్ట్రంలో సంపద పెరిగింది. రాష్ట్ర సంపదను భారాస పెంచితే.. దానిని తుంచడానికి కాంగ్రెస్‌ మళ్లీ కుయుక్తులు పన్నుతోంది. మళ్లీ అధికారంలోకి రాగానే అందరి పింఛన్‌ పెంచుతాం. ఓటు అనే బ్రహ్మాండమైన ఆయుధాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఉపయోగించాలి. మీ ఓటు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. అభ్యర్థిని, వాళ్ల వెనక ఉన్న పార్టీని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలి’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

‘‘ 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. రైతుబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్‌, భారాస ప్రభుత్వం. రైతుబంధు లాంటి పథకాలతో వ్యవసాయదారుల కుటుంబాలు కళకళలాడుతున్నాయి. రైతుబంధు దుబారా అని పీసీసీ మాజీ అధ్యక్షుడు చెబుతున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు ఎకరానికి రూ.16వేలు చేస్తాం. రైతులకు 24 గంటల విద్యుత్‌ వృథా అని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నారు. రైతులకు 3గంటల సరఫరా సరిపోతుందని ఆయన అంటున్నారు. ధరణి పోర్టల్‌ను తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసి.. భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు.. భూమేత’’ అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రజల కోసం అనునిత్యం పని చేసే సబితా ఇంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z