Politics

ఏ తప్పూ చేయనందునే మళ్లీ ఇక్కడ నిలబడ్డా

ఏ తప్పూ చేయనందునే మళ్లీ ఇక్కడ నిలబడ్డా

వ్యవస్థలను మేనేజ్‌ చేసి తెదేపా అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తనపైనా సీఐడీ అధికారులు కేసులు పెట్టారని.. ఒక్క ఆధారమూ చూపలేకపోయారన్నారు. ఏ తప్పూ చేయనందునే మళ్లీ ఇక్కడ నిలబడ్డానని చెప్పారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో ఆయన మాట్లాడారు.

‘‘స్కిల్‌ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? నాపై ఆరు కేసులు పెట్టారు.. అయినా వెనక్కి తగ్గం. మంత్రులకు చెబుతున్నా.. మీకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. నాడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వస్తుంటే ఎలా అడ్డుకున్నారో చూశాం. మాపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. మేం కూడా మీలాగే చేస్తే వైకాపా నేతలంతా జైలులోనే ఉంటారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా.

చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఆయన్ను జైలుకు పంపితే నా పాదయాత్ర ఆగుతుందని వైకాపా నేతలు అనుకున్నారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా యువగళం ఆగదు. వైకాపా బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా మారింది. ఇప్పుడు ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అంటున్నా.. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. జగన్‌ పాలనలో సామాజిక అన్యాయం జరిగింది. అనేక మంది దళితులను వేధించి చంపారు’’ అని లోకేశ్‌ ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z