Business

బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో ఏర్పాటు-వాణిజ్య వార్తలు

బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో ఏర్పాటు-వాణిజ్య వార్తలు

* అప్పుల విషయంలో ఇతర దేశాల కంటే భారత్ బెస్ట్

2027-28 నాటికి భారత ప్రభుత్వ రుణం దేశీయ జీడీపీలో 100 శాతం కంటే ఎక్కువ ఉంటుందనే అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా నివేదక తప్పుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో అప్పులతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలో ఉంది. భారత్ 100 శాతంతో ఉంటే అమెరికా, బ్రిటన్, చైనాల రుణాలు వరుసగా 160, 140, 200 శాతంగా ఉన్నాయి. మన దేశం కంటే ఇతర దేశాల అప్పులు మరింత అధ్వానంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది .అయితే ఇదే నివేదికలో ఐఎంఎఫ్, కొన్ని అనుకూల పరిస్థితులలో, భారత GDP నిష్పత్తికి ప్రభుత్వ రుణం 70 శాతం కంటే తక్కువకు తగ్గవచ్చని సూచించడం కూడా గమనార్హం. తాజాగా ఐఎంఎఫ్ నివేదికపై అధికారులతో చర్చించిన తరువాత మంత్రిత్వ శాఖ, దానిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.సాధారణ ప్రభుత్వ రుణం(రాష్ట్రం-కేంద్రం రెండింటితో సహా)2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 88 శాతం నుండి 2022-23 నాటికి దాదాపు 81 శాతానికి తగ్గిందని, దీంతో నిర్దేశించుకున్న లక్ష్యాలకు చేరువ కావడానికి మరింత దగ్గరగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2025-26 నాటికి ద్రవ్య లోటును జీడీపీలో 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించడానికి లక్ష్యంగా పనిచేస్తున్నాము. దీంతో ప్రభుత్వ రుణాలు దీర్ఘకాలికంగా గణనీయంగా తగ్గుతాయని అంచనా వేశారు.

బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో ఏర్పాటు

ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌ బెంగళూరులో జెనరేటివ్‌ ఏఐ స్టూడియోను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.25 వేల కోట్ల పెట్టుబడిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ జెనరేటివ్‌ ఏఐ స్టూడియో ఉద్దేశం, ఉపయోగం, అందించే సేవలు వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..ప్రస్తుతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం గురించి తెలిసిందే. అన్ని రంగాల వ్యాపారాలు ఈ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీన్ని అందిపుచ్చుకునేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాబోయే మూడేళ్లలో ఏఐ, డేటా ప్రాక్టీస్‌లో 3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.25 వేల కోట్లు)  పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన కొన్ని నెలల తర్వాత, డిసెంబర్ 18న యాక్సెంచర్ భారత్‌లోని బెంగళూరులో జనరేటివ్ ఏఐ స్టూడియోను ప్రారంభించింది.ఉత్పాదక కృత్రిమ మేధ (Generative AI) ఆధారంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి క్సెంచర్ డేటా, ఏఐ బృందం క్లయింట్‌లతో కలిసి పని చేసేందుకు ఓ చోటును కల్పించడమే ప్రాథమికంగా ఈ స్టూడియో ఉద్దేశం. ఏఐ ఆధారిత పరిష్కారాలతో సంస్థలు తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది.జనరేటివ్ ఏఐ అనేది ఒక రకమైన కృత్రిమ మేధస్సు. ఇది శిక్షణ డేటాను పోలి ఉండే కొత్త డేటాను రూపొందించగలదు. వ్యాపార ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. యాక్సెంచర్‌లోని గ్లోబల్ లీడ్- డేటా & ఏఐ సెంథిల్ రమణి ప్రకారం.. మొత్తం వాల్యూ చైన్‌లోని సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తూ తమ ఏఐ పెట్టుబడులను పెంచుకోవడానికి  ఈ స్టుడియో సహాయపడుతుంది.ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పెరిగిన పెట్టుబడి విస్తృత ధోరణిని యాక్సెంచర్‌ ఏఐ స్టుడియో ప్రతిబింబిస్తుంది. యాక్సెంచర్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో 74 శాతం C-సూట్ (ఉన్నత కార్యవర్గాలు) 2024లో తమ ఏఐ సంబంధిత వ్యయాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు.  ఇది అంతకుముందు సంవత్సరంలో 50 శాతమే ఉండేది.స్టూడియో ఉత్పాదక ఏఐకి సంబంధించిన అనేక రకాల సేవలను అందిస్తుంది. వీటిలో యాజమాన్య ఉత్పాదకకేఐ మోడల్ “స్విచ్‌బోర్డ్,” అనుకూలీకరణ పద్ధతులు, మోడల్ మేనేజ్డ్‌​ సేవలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. క్లయింట్‌లకు ఉత్పాదక ఏఐ పరిష్కారాలను అర్థం చేసుకోవడం, ప్రయోగం చేయడం, స్వీకరించడం, పెంచుకోవడంలో సహాయపడేలా ఈ సేవలను రూపొందించినట్లు యాక్సెంచర్‌ పేర్కొంటోంది.

* పెరిగిన కోడిగుడ్డు ధర

గతనెలలో కార్తీకమాసం కారణంగా నాన్ వెజ్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. కిలో చికెన్ ధర కూడా 100 కేజీ పలికింది.. ఈ వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి.. అదే విధంగా కోడి గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి.. కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి.. హైదరాబాద్ లో కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది..రెండు వారాల కింద ఒక్కో గుడ్డు రూ.6 ఉండగా, ఇప్పుడు రూ.7కు చేరింది. హోల్ సేల్​లో ఒక్కో గుడ్డు రూ.5.80 పలుకుతోంది. కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​లో ఎగ్స్​కు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు.. మిగితా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కోడిగుడ్ల వాడకం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు..గుడ్ల ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది.. అందులో కార్తీకమాసం ముగియడంతో ధరలు పెరిగాయి. అలాగే, కోళ్ల దాణా ధరలు రెట్టింపు అవ్వడం కూడా గుడ్ల ధరలు పెరగాడానికి కారణమని సుబ్బరాజు చెప్పారు. గతంలో కరోనా టైమ్ లో గుడ్ల వినియోగం పెరిగిందని, ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ప్రచారంతో చాలామంది ఎగ్స్ తింటున్నారన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువ. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఎగ్స్ లో దాదాపు 50 శాతం ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్​వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.. ఇక రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. మరోవైపు చికెన్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి.

* గ్లోబల్ కంపెనీతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం క్యాన్సిల్

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా గ్లోబల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(MOU) రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన వ్యాపారాలకు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సహాకారాన్ని అందించడానికి ఇన్ఫోసిస్ సంస్థ సెప్టెంబర్‌లో ఒక గ్లోబల్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. 15 సంవత్సరాల కాలానికి ఏఐ సోల్యూషన్స్‌కు సహాకారం అందించడానికి $1.5 బిలియన్లు అంచనా కలిగిన ఎంవోయూపై రెండు సంస్థలు సంతకాలు చేశాయి.ఇప్పుడు తాజాగా ఈ ఒప్పందం క్యాన్సిల్ అయిందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ఈ రద్దుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇంతకుముందు ఇన్ఫోసిస్, లండన్‌కు చెందిన లిబర్టీ గ్లోబల్‌తో $1.64 బిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇన్ఫోసిస్ మొత్తం $7.7 బిలియన్ల విలువైన ఒప్పందాలను కుదర్చుకుంది. కంపెనీ తన డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలను జనవరి 11, 2024న ప్రకటించనుంది.

*  ఓలా ఎలక్ట్రిక్ నిధులు సమీకరించేందుకు ఐపీఓకు దరఖాస్తు

తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద విద్యుత్‌ ద్విచక్రవాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ శుక్రవారం ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. గత 20 ఏళ్లలో మన దేశంలో ఐపీఓకు రానున్న తొలి వాహన సంస్థ ఇదే కావడం విశేషం. ముసాయిదా పత్రాల ప్రకారం.. ఐపీఓలో రూ. 5,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 95,191,195 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను మూల ధన వ్యయాల, ఓలా గిగాఫ్యాక్టరీ ప్రాజెక్ట్‌, అనుబంధ సంస్థ ఓఈటీ రుణాల చెల్లింపు, పరిశోధనా, ఉత్పత్తుల అభివృద్ధికి పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనుంది. కంపెనీ విద్యుత్‌ స్కూటర్లతోపాటు, బ్యాటరీ ప్యాక్స్‌, మోటార్ల వంటి విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది.

వివో ఇండియా మనీలాండరింగ్ కేసులో కొత్త మలుపు

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివోకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా ముగ్గురిని అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే వారు ఎవరనేది మాత్రం బయటకు వెల్లడించలేదు. గతంలో వివో కంపెనీపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివో ఆఫీసుల్లో, దాని అనుబంధ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించగా, రూ.62,476 కోట్ల నిధులను అక్రమంగా చైనాకు తరలించారని ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఇంతకుముందు మొబైల్ కంపెనీ లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి ఓమ్ రాయ్, చైనాకు చెందిన వ్యక్తితో పాటు, చార్టర్డ్ అకౌంటెంట్, మరొక వ్యక్తిని అరెస్ట్ చేయగా, ప్రస్తుతం వారు జ్యూడిషీయల్ కస్టడీలో ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z