Health

పెరుగుతున్న ఆ వైరల్ కేసులు

పెరుగుతున్న ఆ వైరల్ కేసులు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్రమైన అంటువ్యాధి విస్తరిస్తున్నది. ఉత్తరం నుంచి దక్షిణాది వరకు రోజు రోజుకు వైరల్‌ కేసులు పెరుగుతున్నాయి. గవద బిళ్లలు తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్నది. గవద బిళ్లలు అనే రుగ్మత పిల్లలకు సంభవించే ఒక సాధారణమైన వైరల్ అంటువ్యాధి. చెవులు కింద ముఖానికి ఇరువైపులా ఉన్న గవదలభాగంలోని లాలాజల గ్రంధులకు బాధాకరమైన వాపునకు కారణమవుతుంది. గవద బిళ్ల కేసులు పెరుగుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో గవద బిళ్ల వైరల్‌ కేసులు అకస్మాత్తుగా పెరిగినట్లుగా నివేదిక పేర్కొంది. జైపూర్‌లో వైరస్‌ కారణంగా తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురైనట్లుగా తెలుస్తున్నది. ఇన్ఫెక్షన్‌ సోకిన ఆరుగురికి చెవుడు వచ్చినట్లుగా సమాచారం. వైరల్‌ ఇన్ఫెక్షన్‌ గరిష్ఠంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపినప్పటికీ.. కొద్ది సమయాల్లో పెద్దవారి సైతం బాధితులుగా మార్చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో అంటువ్యాధిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో ఫిబ్రవరి-మార్చిలో కేరళలో గవద బిళ్ల కేసులు వేగంగా పెరిగాయి. మార్చి వరకు 11వేలకుపైగా కేసులు నమోదైనట్లు సమాచారం. తమిళనాడులో మార్చి చివరి వరకు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 461 మందికి ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయ్యింది. గవద బిళ్లలతో పాటు అనేక మీజిల్స్‌, చికెన్‌పాక్స్‌ కేసులు సైతం పెరిగాయి. ఇంతకుముందు మూడు-నాలుగు నెలల్లో ఒకటి, రెండు కేసులు మాత్రమే నమోదవగా.. ఏడాదికి 10-15 కేసులు నమోదయ్యాయి. తాజాగా ప్రతి నెలా 40-50 కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. పెద్దవారిని సైతం వైరల్‌ బాధితులగా మారుస్తుందని.. ఇది పిల్లల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంటున్నారు. సందర్భంగా నోయిడాలోని ఇంటెన్సివ్‌కేర్‌కు చెందిన డాక్టర్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. గవద బిళ్లలు టీకా తీసుకోని 2 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు. అయితే, యువకులు, పెద్దలు సైతం వైరల్‌ బారినపడే అవకాశం ఉంటుందన్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత వ్యాక్సిన్ యొక్క రోగనిరోధక శక్తి తగ్గుతుంది. గవద బిళ్లలను నివారించేందుకు ఉత్తమమైన మార్గం టీకాలేనన్నారు. తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.

గవద బిళ్ల ప్రారంభ లక్షణాలు తేలికపాటివిగా ఉంటాయి. చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలా సందర్భాల్లో గవద బిళ్లలు సోకినట్లు కూడా తెలియదని వైద్యులు పేర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్‌ పెరిగే కొద్దీ వ్యాధి తీవ్రత పెరుగుతుందని.. మొదట్లో జ్వరం, తలనొప్పి.. కండరాల నొప్పులు, అలసట, గొంతులో వాపు, ఆకలి మందగించడం తదితర లక్షణాలు ఉంటాయని తెలిపారు. చెవులు, దవడల మధ్య ఉన్న లాలాజల గ్రంధులు ఉబ్బుతాయని.. బాధితుల బుగ్గలు.. దవడలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయని వైద్యులు చెప్పారు. వ్యాధి బారినపడితే చాలా మంది రెండువారాల్లో పూర్తిగా కోలుకుంటారని.. కొంతమందిలో తీవ్రమయ్యే పరిస్థితి ఉండవచ్చని పేర్కొంటున్నారు. కొందరిలో చెవుడు వచ్చే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. అయితే చాలా మందిలో మళ్లీ వినికిడి శక్తి వస్తుందని తెలిపారు.

పారమిక్సో వైరస్‌ కుటుంబానికి చెందిన ఒక వైరస్ ద్వారా గవద బిళ్లలు సోకుతాయి. వాతావరణంలో గాలి బిందువుల ద్వారా సూక్ష్మజీవులు ముక్కు, నోటి ద్వారా మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ వైరస్‌లు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వైరస్‌ ఇతర వ్యక్తులకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ముతున్న, దగ్గుతున్న సమయంలో నోటికి, ముక్కుకు అడ్డంగా చేతిరుమాలు ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీజిల్స్ గవద బిళ్లలకు రెబుల్లా టీకా ప్రభావంతంగా పని చేస్తుందని డాక్టర్‌ శ్రేయాస్‌ తెలిపారు. ఇన్ఫెక్షన్, తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నుంచి రక్షిస్తుందని, వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని నివారించేందుకు.. సోకిన వ్యక్తికి దూరంగా ఉండాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z