Sports

ఇవన్నీ ఎందుకో మాకే తెలీదు…

ఇవన్నీ ఎందుకో మాకే తెలీదు…

అంతర్జాతీయ సిరీస్‌లు లేకపోవడం.. దేశవాళీ టోర్నీలపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఎందుకు సాధన చేస్తున్నామో తమకే తెలియదని భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తెలిపింది. కరోనా మహమ్మారి మహిళల క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పింది. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టు మళ్లీ బరిలో దిగలేదు. జులై- ఆగస్టులో జరగాల్సిన ఇంగ్లాండ్‌ పర్యటనను బీసీసీఐ రద్దు చేసింది. ఐపీఎల్‌ సందర్భంగా నవంబరు 1 నుంచి 10 వరకు యూఏఈలో మూడు జట్లతో మహిళల టీ20 ఛాలెంజర్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నా విదేశీ క్రీడాకారిణులు పాల్గొనడంపై అయోమయం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో సిరీస్‌లపైనా అనిశ్చితి నెలకొంది. 2021 మహిళల వన్డే ప్రపంచకప్‌ కూడా వాయిదా పడటంతో టీమ్‌ఇండియా మహిళల జట్టు భవిష్యత్‌ అంతర్జాతీయ క్యాలెండర్‌ అయోమయంగా తయారైంది. ‘‘భవిష్యత్తులో ఏం జరుగుతుంది? టోర్నీల సంగతేంటి? అన్న ఆత్రుత అందరిలోనూ ఉంది. ప్రస్తుతం ఎందుకు సాధన చేస్తున్నామో మాకే తెలియదు. దేనికైనా ఒక ఉద్దేశం ఉండాలి. ఇంతకుముందు విదేశాల్లో లేదా సొంతగడ్డపై అంతర్జాతీయ సిరీస్‌లు ఉన్నప్పుడు అందుకు తగ్గట్లు సన్నద్ధమయ్యేవాళ్లం. ఇప్పుడు మేం ఎందుకు ప్రాక్టీస్‌ చేస్తున్నామో తెలియదు. అంతర్జాతీయ క్రికెట్‌ లేదా దేశవాళీ టోర్నీలు లేనప్పుడు సాధన చేసి ఏం లాభమని అప్పుడప్పుడు అనిపిస్తుంది’’ అని మిథాలీ తెలిపింది.