Politics

ఇక జగన్ కేసులు త్వరగా తెలంగాణాలో విచారణ

ఇక జగన్ కేసులు త్వరగా తెలంగాణాలో విచారణ

ఆర్థిక నేరాలతోపాటు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై అభియోగాలను త్వరితగతిన తేల్చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. దీనిపై అమికస్‌ క్యూరీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించింది. నేతలపై ఉన్న కేసులను త్వరగా తేల్చేసేలా అవసరమైతే ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు సహాయం కూడా చేస్తామని ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు సూచనలు చేసింది. నేతలపై ఉన్న కేసుల విచారణ నిర్దిష్ట కాలవ్యవధిలో ముగిసేలా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.
*ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఆర్థిక అక్రమాలు, అవినీతి, క్రిమినల్‌ కేసులను త్వరితగతిన తేల్చేయాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలపై అన్ని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై శనివారం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. కొవిడ్‌-19 నేపథ్యంలో కోర్టుల్లో కేసుల విచారణకు సంబంధించి విధించిన ఆంక్షలను పాక్షికంగా సరళీకరిస్తూ తెలంగాణ హైకోర్టు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. సీబీఐ, ఏసీబీ ప్రత్యేక కోర్టుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్‌లో ఉన్న కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది.
*మిగిలిన కేసుల్లో మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి యూనిట్‌ హెడ్స్‌, ఆయా కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పరిస్థితులకు అనుగుణంగా విచారణను భౌతికంగా చేపట్టాలో, ఆన్‌లైన్‌లో చేపట్టాలో జిల్లా పోర్టిఫోలియో జడ్జిని సంప్రదించి, నిర్ణయం తీసుకోవాలని సూచించింది. న్యాయపరిపాలన సాఫీగా సాగేందుకు మిగిలిన జిల్లాల్లోని ప్రధాన జడ్జీలు రోజువారీ స్థాయీ నివేదికలను ఆయా జిల్లాల పరిపాలనా (పోర్టుఫోలియో) జడ్జీలకు, హైకోర్టు రిజిస్ట్రీకి నివేదికలు ఇవ్వాలని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వరరెడ్డి పేరిట శనివారం సర్క్యులర్‌ జారీ అయ్యింది. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన కేసుల ఫైలింగ్‌ను భౌతికంగా/ఆన్‌లైన్‌లో చేసుకోడానికి అనుమతించింది. సంగారెడ్డి జిల్లా కేంద్రం మినహా.. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లా కోర్టుల్లో భౌతిక విచారణను నవంబరు 6 వరకు పొడిగించింది. మెదక్‌ జిల్లా ప్రధాన జడ్జి.. జిల్లా పరిపాలన జడ్జితో సంప్రదించి, పరిస్థితులకు అనుగుణంగా సంగారెడ్డి(హెడ్‌క్వార్టర్స్‌)లోని కోర్టుల్లో భౌతిక విచారణపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
****జగన్‌పై కేసులు తెలంగాణలోనే…
హైకోర్టు నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో ఇక రోజువారీ విచారణ జరగనుంది. అక్రమాస్తులకు సంబంధించి జగన్‌పై దాఖలైన కేసులన్నీ తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలయ్యాయి. జగన్‌పై 2011 ఆగస్టు 17న ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదైంది. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని, పెట్టుబడుల రూపంలో నిధులు రాబట్టారని సీబీఐ నిర్ధారించింది. ఈ కేసులకు సంబంధించి 2012 మార్చి 31న హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో మొట్టమొదటి అభియోగ పత్రం.. 2014 సెప్టెంబరు 9న ఇందు ప్రాజెక్టు కేసులో చివరి చార్జిషీట్‌ దాఖలైంది.
****మొత్తంగా సీబీఐ ఒక్కటే జగన్‌ తదితరులపై 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇక… మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఐదు చార్జిషీట్లు దాఖలు చేసింది. **విశేషమేమిటంటే… ఇప్పటిదాకా ఏ ఒక్క కేసులోనూ కోర్టులో అసలు విచారణ మొదలుకాలేదు.ఎప్పటికప్పుడు జగన్‌ తదితరులు వేస్తున్న రకరకాల పిటిషన్లపైనే విచారణ జరుగుతూ వస్తోంది. నిబంధనల ప్రకారం జగన్‌తోపాటు ఇతర నిందితులు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలి. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఈ హాజరుపై ఎప్పటికప్పుడు మినహాయింపు తీసుకుంటున్నారు. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 10వ తేదీన ఆయన కోర్టుకు హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయనతోపాటు నిందితులుగా ఉన్న విజయసాయి రెడ్డి, ‘రాంకీ’ అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సుప్రీం మార్గదర్శకాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో.. వీరందరిపైనా రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉంది.
***రాష్ట్రంలో నేతలపై 143 కేసులు
తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన మాజీ, సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రత్యేక సీబీఐ కోర్టుల్లో 118 కేసులు, ఏసీబీ కోర్టుల్లో 25 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 14 కేసుల్లో స్టే ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయా కేసులపై ఇక రోజువారీ విచారణ జరగనుండగా, స్టేలు ఉన్న కేసులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రతి శనివారం విచారణ చేయనున్నట్లు తెలిసింది.