Politics

ఏపీ ప్రభుత్వ సలహాదారులపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ ప్రభుత్వ సలహాదారులపై హైకోర్టు ఆగ్రహం

‘ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, సలహాదారుల నియామక విధానం, వారికి అప్పగించిన విధుల స్వభావం ఏమిటి? విధుల నిబంధనలు, విధి విధానాలేంటో అదనపు అఫిడవిట్‌ రూపంలో మా ముందు ఉంచండి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొంతమంది సలహాదారులు రాజకీయ అంశాలనూ మీడియాతో మాట్లాడటంపై తీవ్రంగా ఆక్షేపించింది. కొందరు సలహాదారులు రాజకీయ విషయాలు మీడియాతో మాట్లాడటం చట్ట వ్యతిరేకం కాదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. సలహాదారులకు అప్పగించిన విధులను పరిశీలించాలని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. మంత్రులు ఉండగా.. ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సలహాదారులు సమీక్ష సమావేశాలు నిర్వహించవచ్చా? అని సందేహం వ్యక్తంచేసింది. నీలం సాహ్ని 2020 డిసెంబరు 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా పదవీవిరమణ చేశారని, అయితే డిసెంబరు 22నే ఆమె ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారని గుర్తుచేసింది. ఆమె 2021 మార్చి 27న ఆ పదవికి రాజీనామా చేశారని.. అయితే దానికి ముందే ముఖ్యమంత్రి ఎస్‌ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌) నియామక విషయంలో మార్చి 24నే గవర్నర్‌కు పంపిన మూడు పేర్లలో నీలం సాహ్ని పేరుందని గుర్తుచేసింది. గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి మీరు అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)గా పనిచేసినప్పుడు ప్రభుత్వంలోని సలహాదారులు ప్రభుత్వ, రాజకీయ విషయాల్ని మీడియాతో మాట్లాడటం, పత్రికా సమావేశాలు నిర్వహించడం గమనించారా? అని ప్రశ్నించింది. అప్పట్లో అలా లేదని ఆయన బదులిచ్చారు. ముఖ్యమంత్రి నిర్ణయాల్లో సలహాదారులు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. తమకు అప్పగించిన అంశాలపై వారు అధికారులతో సమీక్షలు నిర్వహించవచ్చన్నారు. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై గురువారం విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రభుత్వ, ముఖ్యమంత్రి సలహాదారుల విధులు, నియామక విధివిధానాలను కోర్టుముందు ఉంచాలని ఆదేశించారు. విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు. నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం నాటి విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది హాజరు కానందున వాయిదా వేయాలని న్యాయవాది సాల్మన్‌రాజు కోర్టును కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.