Politics

వామ్మో ఇన్ని వెన్నుపోట్లా??? బిత్తరపోతున్న చంద్రబాబు

Chandrababu very disappointed on how party workers sugar coated facts and misguided him

కుప్పంలో మెజారిటీ తగ్గటానికి స్థానిక టీడీపీ నేతలే కారణమని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో టీడీపీ ఘోరంగా ఓటమి చెందటానికి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు, జన్మభూమి కమిటీ సభ్యులే కారణమని తేల్చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు ఇటీవల వరుసగా అమరావతికి వెళ్లి చంద్రబాబును కలిసి వస్తున్నారు. మొన్న కుప్పం, తిరుపతి నియోజకవర్గానికి చెందిన నాయకులు చంద్రబాబును కలిశారు. అంతకు ముందు పలమనేరు, పీలేరు, మదనపల్లె, శ్రీకాళహస్తికి చెందిన మరికొందరు నాయకులు కలిసినట్లు సమాచారం. చంద్రబాబును కలిసిన నాయకులతో రెండు మూడు మాటలు మాట్లాడి పంపేస్తున్నట్లు తెలిసింది. అది కూడా ఎందుకు ఓటమి పాలయ్యాము? అందుకు కారణాలు? అనే విషయాలు అడుగుతున్నారు. నియోజకవర్గంలో ఓటమికి ప్రధాన కారణాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా కుప్పం నాయకులపై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కుప్పంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా మెజారిటీ తగ్గిందని, అందుకు ‘మీరే కారణం’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ఓ నాయకుడు వెల్లడించారు. స్థానికంగా ఉన్న భూములను ఆక్రమించుకోవటం, టెండర్లు దక్కించుకుని పనులు నాసిరకంగా చేయడం తదితర పనులు కొంప ముంచాయని గుర్తు చేసినట్లు తెలిసింది. టెలీకాన్ఫరెన్స్‌లో అంతా బాగుందని చెబుతూ…మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం, చంద్రగిరి విషయంలో స్థానిక నాయకులు టీడీపీ గెలుపు ఖాయమని పలుమార్లు చెప్పారని, తీరా చంద్రగిరిలో ఘోరంగా పరాజయం పాలైన విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. నీరు–చెట్టు, హౌసింగ్, ఇసుక అక్రమ రవాణా, భూముల ఆక్రమణ తదితర అవినీతి అక్రమాలే కొంపముంచాయని సన్నిహితులు వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి తోడు జన్మభూమి కమిటీల ఆగడాలు అధికమయ్యాయని, లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లు చేసి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని గుర్తుచేసినట్లు తెలిసింది. ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకోవటం, అధికారులను బెదిరించడం తదితర కారణాలు దెబ్బతీసినట్లు చర్చకు వచ్చాయి. ఓటర్లను కొనుగోలు చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయడం మరిచి, స్వార్థం చూసుకున్నామని, అయితే ఇవేమీ జనం పట్టించుకోరని భావించానని, అన్నింటినీ జనం గుర్తుపెట్టుకున్న విషయం గురించి ప్రధానంగా చర్చించనట్లు తెలిసింది. ముఖ్యంగా వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తప్పు చేశామని పలమనేరు నాయకులు చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి జనంలో ఉండడం, వారి సమస్యల గురించి తెలుసుకోవడం, వాటిపై పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇవేమీ తనకు తెలియకుండా అంతా బాగుందని చెప్పి, ఓటమికి కారణమయ్యారని నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాకు వచ్చి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని స్థానిక నాయకులకు చెప్పి పంపటం గమనార్హం.