Politics

ఛీ…ఛీ….కోడెల ఇదేమి కక్కుర్తి

Kodela Moved Assembly Furniture To His Home

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబం సాగించిన అవినీతి మండవ లీలలు రోజుకొకటి బయటకి వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పరువును కోడెల కుటుంబం బజారు కీడ్చుతోంది. ఏకంగా కుటుంబం మొత్తం వివాదాల్లో చిక్కుకుంది. వరస పెట్టి ఆరోపణలు..విమర్శలు..కేసులు. అధికారంలో ఉండగా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా పీడించారని కోడెల కుటుంబం విమర్శలు ఎదుర్కొంది. ఏపీలో ఏ తెలుగుదేశం నేతపైన కూడా రానన్ని విమర్శలు..ఆరోపణలు ఒక్క కోడెల శివప్రసాద రావుపైనే వచ్చాయి. చివరకు కోడెల శివప్రసాదరావు కక్కుర్తి ఎంత వరకూ వచ్చింది అంటే ఏకంగా అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ ను కూడా ఇంటికి తరలించే వరకూ వచ్చింది. దీనికి సంబంధించి రికార్డులను పరిశీలించిన అసెంబ్లీ అధికారులు దీనిపై కేసు నమోదు చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అసెంబ్లీ ఫర్నీచర్ ఇంటికి తీసుకెళ్ళటం అనేది అప్రతిష్ట.అంతే కాదు..అవును తాను తీసుకెళ్ళిన మాట వాస్తవమే అని..తిరిగి తీసుకెళ్ళమని లేఖలు రాశానని కోడెల విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించటంతో వ్యవహారం మరింత దారుణంగా తయారైంది. లేదంటే లెక్క కట్టి చెపితే డబ్బులు ఇస్తానని ఇప్పుడు కోడెల వ్యాఖ్యానిస్తున్నారు. అసలు స్పీకర్ గా ఉన్న వ్యక్తి అత్యంత పవిత్రంగా భావించే అసెంబ్లీ కోసం కొనుగోలు చేసిన సామాన్లు ఇంటికి తరలించటం ఎందుకు?. తర్వాత తీసుకెళ్ళమని లేఖ రాయటం ఎందుకు?. లేదంటే ఇప్పుడు డబ్బులు కడతానని ఆఫర్ ఇవ్వటం ఏంటి?. ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ పరువును తీసినట్లు అయిందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.