Devotional

21 పత్రాలు అనగా ఏమి?

21 పత్రాలు అనగా ఏమి?

పురాణాల ప్రకారం హిందువులకు తొలి పండుగ వినాయక చవితి. ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాథుడికే. అగ్రపూజ అందుకునే దేవుడు, విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు. తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించి, విజ్ఞతతో గణాధిపత్యం పొందిన బుద్ధిమంతుడు. అలాంటి గణపతిని పూజించడానికి వినాయక చవితినాడు పత్రాలే ప్రధానమైనవి. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వాటి పేర్లు, వాటిలోని వైద్య గుణంల గురించి మీరూ తెలుసుకోండి.
1.మాచీ పత్రం :
ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. నేత్ర రోగాలకు అద్భుత నివారిణి. కంటి, చర్మ వ్యాధులు నయమవుతాయి. ఈ పత్రాన్ని ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి అని అర్చించాలి.
2.బృహతీ పత్రం :
దీన్నే వాకుడాకు నేల మునగాకు అని కూడా పిలుస్తాం. ఇది కంఠ రోగాలను, శరీరనొప్పులను, ఎక్కిళ్లు, కఫ, వాత దోషాలను, ఆస్తమాను, దగ్గును, సైనసైటిస్‌ను తగ్గిస్తుంది. ఈ పత్రాన్ని ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి.
3.బిల్వ పత్రం :
దీనికే మారేడు అని పేరు. శివునికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం. ఇది మధుమేహానికి దివ్య ఔషధం. మారేడు వేళ్ళతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు. ఈ పత్రాన్ని ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అంటూ అర్చించాలి.
4. దూర్వాయుగ్మం (గరిక) :
గణపతికి అత్యంత ఇష్టమైన పత్రం గరిక. తులసి తరువాత అంత పవిత్రమైంది గరిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి.
5. దత్తూర పత్రం :
దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. కఫ, వాత దోషాలను హరిస్తుంది. దీనిని వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవాలి. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి అంటూ వరసిద్ధి వినాయకునికి సమర్పించాలి.
6. బదరీ పత్రం :
దీనినే రేగు అని పిలుస్తుంటాం. బదరీ వృక్షం సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు, అన్నం అరుగుదల సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి.
7. అపామార్గ పత్రం :
దీనికే ఉత్తరేణి అని పేరు. దీని పుల్లలు యజ్ఞాలు, హోమాల్లో వినియోగిస్తారు. ఆ పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్థూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, టాక్సిన్స్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి.
8. తులసి :
ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణాలున్న మొక్క తులసి. పరమపవిత్రమైంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. కఫ, వాత, పైత్య దోషాలను మూడింటినీ అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది. తులసి ఆకులు, వేర్లు, కొమ్మల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. తులసిచెట్టు రోజుకు 22 గంటలపాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఓం గజకర్ణాయ నమః తులసి పత్రం పూజయామి అంటూ గణపతికి అర్పించాలి.
సూచన : పురాణకథ ఆధారంగా గణపతిని ఈ తులసీ దళాలతో ఒక్క వినాయకచవితి నాడు తప్ప ఇంకెప్పుడూ ఆరాధించకూడదు.
9. చూత పత్రం :
ఇదే మామిడి ఆకు. నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ఠ స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు. ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి.
10 కరవీర పత్రం:
దీనినే గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం ఉంది. గన్నేరుపూలు మరే ఇతర ప్రదేశంలో కిందపడినా నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరుచెట్టునుంచి వచ్చిన గాలి పీల్చినా అనేక రోగాలు నయం అవుతాయి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి అంటూ సమర్పించాలి.
11. విష్ణుక్రాంత పత్రం :
దీనినే అవిసె అంటాం. ఇది తామర వ్యాధిని అరికడుతుంది. విష్ణుక్రాంత పత్రం మేధస్సును పెంచుతుంది. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి అంటూ విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించాలి.
12. దాడిమీ పత్రం :
అంటే దానిమ్మ. లలిత సహస్రనామాల్లో అమ్మవారికి దాడిమికుసుమప్రభ అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం వల్ల అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు, గాయాలు మానిపోతాయి. వాపును అరికడుతుంది. పైత్యం, విరోచనాలు, ఉబ్బం, అజీర్తి, దగ్గు వంటివి అదుపులో ఉంచుతుంది. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి అని ఈ పత్రాన్ని గణపతికి సమర్పించాలి.
13. దేవదారు పత్రం:
ఇది వనములలో, అరణ్యములలో పెరిగే వృక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయా పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు నూనె తలకు రాసుకుంటే.. మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు నూనె వేడినీళ్ళలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి అని సమర్పించాలి గణపతికి.
14. మరువక పత్రం :
మనం దీన్ని మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్టుమెంట్లలోనూ కుండీల్లో పెంచుకోవచ్చు. ఇది మంచి సువాసన గల పత్రం. మరువం వేడినీళ్ళలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది. ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి.
15. సింధువార పత్రం:
ఇదే వావిలి ఆకు. వావిలి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ఓం హేరంభాయ నమః సింధువార పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి.
16. జాజీ పత్రం :
జాజీ పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. జాజి కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల కాన్సర్ నివారణఅవుతుంది. చర్మరోగాలను, కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులిపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. ఓం శూర్పకర్ణాయ నమః జాజి పత్రం సమర్పయామి అని సమర్పించాలి.
17. గండకీ పత్రం :
దీనిని దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీపత్రం. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబులను హరిస్తుంది. ఓం స్కంధాగ్రజాయ నమః గండకీ పత్రం సమర్పయామి అంటూ వినాయకునికి సమర్పించాలి.
18. శమీ పత్రం :
దీనిని జమ్మి అంటాం. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమాకు ఔషధం. ఓం ఇభవక్త్రాయనమః శమీపత్రం సమర్పయామి అంటూ గణపతికి సమర్పించాలి.
19. అశ్వత్థ పత్రం :
ఇదే రావి వృక్షం. రావి సాక్షాత్ శ్రీమహావిష్ణు స్వరూపం. రావి భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడతారు. రావి చర్మరోగాలను, ఉదరసంబంధ రోగాలను, నయం చేస్తుంది. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి.
20. అర్జున పత్రం :
దీన్నే మద్ది అంటాం. ఇది తెలుపు, ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. కానీ వాతాన్ని పెంచుతుంది. మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి అంటూ పూజించాలి.
21. అర్కపత్రం :
ఇది జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళలో పడడం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ జిల్లేడు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్తశుద్ధిని కలిగిస్తుంది. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి అని సమర్పించిన తర్వాత..
చివరిగా ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి అంటూ ఈ పూజను ముగించాలి.