NRI-NRT

భార్యలను హింసించే ప్రవాస భర్తలు వేలల్లో ఉన్నారు

Indian NRI Sadist Husbands Sadists Presented In LokSabha

విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలకు భద్రత కల్పించే విధంగా అప్పటి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విదేశాల్లోని మహిళలు గృహహింస, వరకట్న వేధింపులు వంటి సమస్యలు ఎదుర్కుంటుంటే భర్తలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత నెల వరకు భారీగా ఫిర్యాదులు అందినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. లోక్‌సభా సమావేశాల్లో భాగంగా విదేశాంగశాఖకు ఎదురైన ప్రశ్నకు కేంద్ర సహాయ వి.మురళీధరన్‌ సమాధానమిచ్చారు. ‘2015 నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు ఆరువేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది అక్టోబరు చివరి నాటికి 991 ఫిర్యాదులు వచ్చాయి. 2018లో 1,299కేసులు నమోదైయ్యాయి. 2017లో 1,498 ఫిర్యాదులు, 2016లో 1,510, 2015లో 796 ఫిర్యాదులు అందాయి. గత మూడేళ్ల కాలంలో 77మంది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకున్నారు. వీరిలో 73 మంది భారత్‌కు తిరిగి రాగా, ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు ఇప్పటికీ చెరలోనే ఉన్నారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉపాధి, వలస నిమిత్తం కువైట్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, ఖతార్‌, ఒమన్‌, యూఏఈ వెళ్లిన భారతీయుల్లో 2019 అక్టోబరు నాటికి 4,823 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018లో ఈ సంఖ్య 6,014గా ఉంది. 2017లో 5,906, 2016లో 6,013 మంది, 2015లో 5,786 మంది మృతి చెందారు’ అని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.