Business

ఎయిర్‌టెల్ మరో దెబ్బ

Airtel Doubles Minimum Recharge Tariff

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మరో షాకిచ్చింది. ప్రీపెయిడ్‌ కనీస రీఛార్జి మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు రూ.23గా ఉన్న మొత్తాన్ని రూ.45 చేసింది. అంటే అవాంతరాలు లేని ఎయిర్‌టెల్‌ సేవలు పొందాలంటే వినియోగదారులు నెలకు మరో రూ.22 అదనంగా చెల్లించాలన్నమాట! పెంచిన కనీస రీఛార్జి మొత్తాన్ని నేటి నుంచే అమలు చేస్తున్నామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై 28 రోజులకు ఎయిర్‌టెల్‌ వినియోగదారులు నెలకు రూ.23కు బదులు రూ.45 రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జితో ఎలాంటి డేటా, ఉచిత కాల్స్‌ లభించవు. రూ.45 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జి చేయకుంటే గత ప్లాన్‌ గ్రేస్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత సేవలను నిలిపివేస్తామని కంపెనీ పేర్కొంది. ప్రీపెయిడ్‌ రీఛార్జి పథకాల మొత్తాల్ని ఇటీవలే దాదాపు 50 శాతం మేర పెంచిన ఎయిర్‌టెల్‌.. తాజాగా మరోసారి వినియోగదారులపై భారం మోపడం గమనార్హం.