WorldWonders

ఆ ఇంటి వయస్సు 150ఏళ్లు మాత్రమే!

This home in krishna district movva mandal is 150 years old

ఇల్లంటే… ఆధునికంగా ఉండాలి, మంచి ఫర్నిచర్‌తో నింపేయాలి…అని చెప్పేస్తారు ఎవరైనా…కానీ వాళ్లు మాత్రం ఇల్లంటే మా ఇంటిలా ఉండాలి… అంటారు.ఇటుకల పేర్ఫో..సామగ్రి కూర్పో కాదు…ఇల్లు సంస్కృతికి అద్దం పట్టాలి, సంప్రదాయాలను నిలబెట్టుకోవాలి, అనుబంధాలకు కొత్త నగిషీలు అద్దాలి.. అని వారు నిరూపిస్తున్నారు.
*కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెడసనగల్లులోని ఆ ఇంట్లో ఆరు తరాలుగా అనుబంధాలు చెక్కుచెదరలేదు. 150 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇంటిని కుటుంబ సభ్యులు అపురూపంగా చూసుకుంటారు. ఇప్పటివరకు ఆ ఇంట్లో 165 మంది పుట్టారు. వాళ్లందరికీ ఆ గృహమంటే ఎంతో ఆపేక్ష. ఎక్కడ ఉన్నా వారి పండగలు, పబ్బాలు ఇక్కడే. నాడు సూరపనేని సీతారాముడు, రంగమ్మ దంపతులు ఇంటిని నిర్మించినప్పటి నుంచి నేటి ఆరోతరం దాకా అందరూ ఆ ఇంట్లోని ప్రతి వస్తువును ఎంతో ఇష్టపడతారు. ఇంటి ప్రధాన ద్వారం నుంచి కిటికీల వరకు ఎంతో సుందరంగా ఉంటాయి. అప్పట్లో ధాన్యం దాచుకునే భోషాణాలను బీరువాలుగా మార్చి ఉపయోగించుకుంటున్నారు. 90 ఏళ్ల నాటి పందిరి పట్టె మంచం ఎంతో అందంగా కన్పిస్తుంది. ఇప్పటి గోనెసంచులు ఏడాదిలో పాడైపోతుండగా 75 సంవత్సరాల కిందటి గోనెసంచి ఇప్పటికీ ఎంతో గట్టిగా ఉంది. వడ్లు దంచుకునే కుందు నుంచి గంధం చిలికే సాన, రోకళ్లు, 150 సంవత్సరాల కిందటి లాకర్‌, 80 ఏళ్ల కిందటి చెక్కబీరువాలు, ఇలా నాటి వస్తువులు ఎన్నో కనిపిస్తాయి. ప్రతి ఇంటినీ ఇలా మలుచుకోమని చెబుతారు ఈ ఇంట్లోని వారంతా.