Movies

కాలం గాయాన్ని మాన్పలేదు

ప్రముఖ గాయని చిత్ర తన కుమార్తె నందనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నందన వర్ధంతి నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఏళ్లు గడుస్తున్నా పాపను పోగొట్టుకున్న బాధ ఇంకా అలానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందని పెద్దలు అంటారు. ఆ పని పూర్తయితే ఆత్మ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతుందని చెబుతారు. అంతేకాదు కాలం గాయాన్ని నయం చేస్తుందని కూడా అంటుంటారు. కానీ ఇదంతా నిజం కాదని ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. కూతుర్ని పోగొట్టుకున్న నా గాయం ఇంకా పచ్చిగా ఉంది, నన్ను బాధిస్తూనే ఉంది’ అని చిత్ర పోస్ట్‌ చేశారు. 2011లో సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ కాన్సర్ట్‌లో ప్రదర్శన కోసం చిత్ర తన ఎనిమిదేళ్ల కుమార్తె నందనతో కలిసి దుబాయ్‌ వెళ్లారు. బస కోసం దిగిన హోటల్‌లో బెడ్‌రూమ్‌ పక్కనే స్విమ్మింగ్‌ పూల్‌ ఉంది. అప్పటి వరకు బెడ్‌రూమ్‌లో టీవీ చూస్తున్న పాప.. చిత్ర స్నానానికి వెళ్లిన వెంటనే స్విమ్మింగ్‌ పూల్‌ గేటు తీసుకుని ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయింది. ఊపిరాడక.. మృతి చెందింది. ఈ ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది.