Movies

నా పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా

నా పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా

దివంగత కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హిందీ చలనచిత్ర పరిశ్రమలో చాలా ఒత్తిడి ఎదుర్కొన్నాడనీ, పలువురి చేత తిరస్కరణలకు గురయ్యాడనీ గతంలో కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. అంతే కాదు… ‘సుశాంత్‌ది ఆత్మహత్యా? ఓ పథకం ప్రకారం చేసిన హత్యా?’ అని ఆమె ప్రశ్నించారు. సుశాంత్‌ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఒకవేళ తన వాదనలు నిరూపించలేని పక్షంలో తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఇచ్చేస్తానని కంగనా రనౌత్‌ అంటున్నారు. ‘‘సుశాంత్‌ కేసులో ముంబై పోలీసులు నాకు సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం నేను మనాలీలో ఉన్నాననీ, నా స్టేట్మెంట్‌ తీసుకోవడానికి ఎవరినైనా పంపించమనీ వాళ్లను అడిగాను. ఆ తర్వాత నాకు ఎటువంటి సమాచారం అందలేదు. నేను చెప్పిన వాటికి సాక్ష్యాలు లేకపోతే, నిరూపించలేకపోతే… నా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తా’’ అని కంగనా రనౌత్‌ స్పష్టం చేశారు. తాప్సీ, స్వరా భాస్కర్‌కి ఆమె ఓ ప్రశ్న వేశారు. అలాగే, కరణ్‌ జోహార్‌పై పరోక్షంగా సెటైర్స్‌ వేశారు. ‘‘రేపన్న రోజు ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన తాప్సీ, స్వరా భాస్కర్‌ పైకి లేచి తమకు చలనచిత్ర పరిశ్రమపై ఎంతో ప్రేమ ఉందని చెప్పవచ్చు. ఒకవేళ వాళ్లు ఇండస్ట్రీని, కరణ్‌ జోహార్‌ని ప్రేమిస్తున్నట్టయితే… అలియా భట్‌, అనన్యా పాండేకి అవకాశాలు వస్తున్నట్టు వాళ్లకు ఎందుకు రావడం లేదు? చిత్రసీమలో అలియా, అనన్యా ఉనికి బంధుప్రీతికి సాక్ష్యం’’ అని కంగనా రనౌత్‌ అన్నారు.