Politics

హోమ్ క్వారంటైన్‌కు మోడీ

ప్రధాని మోడీపై శివసేన పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని హోం క్వారంటైన్‌లోకి వెళ్తారా..? అని ప్రశ్నించింది. శివసేన పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆదివారం తమ పార్టీ పత్రిక “సామ్నా”లో రోక్‌తోక్‌ అనే తన కాలమ్‌లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. మోడీ భక్తితో గోపాల్ దాస్ చేతిని కూడా పట్టుకున్నారు. అందుకే ఆయన కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి అని డిమాండ్ చేసారు. అంతే కాకుండా కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్‌పై కూడా సంజయ్‌ రౌత్ విరుచుకుపడ్డారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న మేఘవాల్ వ్యాఖ్యలపై రౌత్ వ్యంగ్యంగా కామెంట్లు చేసారు. చైనా ఇప్పటికే వ్యాక్సిన్ ను కూడా కనిపెట్టేసింది మనం మాత్రం ఇంకా ఆత్మ నిర్భర భారత్‌పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటామని అన్నారు. ఇదిలా ఉండగా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మహంత్ నృత్య గోపాల్ దాస్ కు ఆగస్టు 13న కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే శివసేన మోడీ క్వారంటైన్ లో ఉండరా అని ప్రశ్నింస్తుంది.