Business

ఆర్థిక సునామీ వస్తోంది:యండమూరి

ఆర్థిక సునామీ వస్తోంది:యండమూరి

వచ్చే ఐదేళ్లలో ఆర్థిక అధోగతి సునామీ:

ఏపీ ఆర్థిక వ్యవస్థపై యండమూరి వీరేంద్రనాథ్ అద్భుత విశ్లేషణ, హెచ్చరికలు…

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్రనాథ్ కీలక విశ్లేషణ చేశారు. ప్రభుత్వాలు పేదలకు ఉచితం, సంక్షేమ పథకాలు అంటూ ప్రజలపై మోయలేని భారాన్ని వేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి కూడా నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మన రాష్ట్ర వ్యవస్థ ఇలా తయారవటానికి అంకురార్పణ 20 ఏళ్ల క్రితమే జరిగింది. రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోకుండా, ప్రస్తుత ప్రభుత్వం పోటీపడి మరీ ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. అంతే కాకుండా, ‘ఇది ఇతర రాష్ట్రాలకు పాకింది’ అని యండమూరి వ్యాఖ్యానించారు.

‘సంపన్నుల నుంచి పన్నులు వసూలు చేసి పేదలకు పంచిపెట్టటం సోషలిజం. ఈ సోషలిజం అనే స్లో పాయిజన్ తో ప్రజలు క్రమేణా పని చేయటం మానేసి సోమరులుగా తయారవటం మొదలు పెట్టారు… కష్టపడగలిగీ, సంపాదించగలిగిన వాళ్ళుకూడా ఉచితాలకు అర్రులు చాస్తున్నారు, బానిసలౌతున్నారు…. ఇప్పుడు ఇలాంటివారే అధికాంశంగా ఉన్నారన్నది నిర్వివాదాంశం…

ఐతే డబ్బు పెంచుకోవటానికి ఉత్పత్తి అవసరం లేదన్న విషయం సంపన్నులు తెలుసుకున్నారు. దాంతో ఉత్పాదనలు తగ్గించి అసలు ‘సంపద సృష్టించటం (creation of assets)’ అనేది పక్కన పెట్టేశారు. నేను ఇప్పటికే ఈ రియల్ ఎస్టేట్, మనీ లాండరింగ్ కాన్సెప్ట్‌లను కూలంకషంగా వివరించాను. ఒకవైపు పన్నుల రాబడి తగ్గిపోతోంది, మరోవైపు బీదలను పైకి తీసుకురావటానికి బదులు ఉచిత బియ్యం, కరెంటు, ఎక్కౌంటుల్లో డబ్బులు, చదువు, వైద్యం అంటూ వారిని అన్నీ ఉ..చి..తంగా పొందటానికి అలవాటు చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే ఇంకో దశాబ్దం అయ్యేసరికి 95 శాతం ప్రజలు పని పూర్తిగా మానేసి కేవలం ప్రభుత్వంపైనే పూర్తిగా ఆధారపడతారు…. ఐనా సరే వారిని తప్పు పట్టలేం.

ఇలా మనుగడ కష్టసాధ్యమే…
సరే, సోషలిజం సంగతి పక్కన పెడదాం. మీకు తెలుసా? మన రాష్ట్రం ఎఫ్ఆర్‌బీఎం(ద్రవ్య బాధ్యత, బడ్జెట్ మేనేజ్‌మెంట్) క్రమశిక్షణ పరిమితి 3.5 ను దాటింది. అంతే కాదండోయ్, ఇది మనుగడకు ఎంతమాత్రం సరిపోదు అని అన్నారు. ఆర్ధిక క్రమశిక్షణలో అధమ స్థానం మరి ఇది. మన ఆదాయం 55 వేల కోట్లు అయితే, ఉచిత వరాలు 50 వేల కోట్లు. వడ్డీ కట్టటానికి అప్పు చేస్తున్న దుస్థితి. మరో వైపు ప్రభుత్వం కాంట్రాక్టర్లు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలైనవాటికి ఏడాది కాలంగా దాదాపు 25 వేల కోట్లు బాకీపడి ఇవ్వటం లేదు. ఇదిలా ఉండగా, పెన్షన్లు 1,000 శాతo పెరిగాయని యండమూరి వివరించారు.

ఆర్థిక సునామీ అనేది తప్పదు..
‘రూ. 50వేల కోట్ల అప్పులు, రూ. 50వేల కోట్ల వేజ్ బిల్లు, వడ్డీ రూ. 25వేల కోట్ల చెల్లింపుల హామీతో ప్రభుత్వం రూ. 2.2 లక్షలకోట్ల బడ్జెట్ అంచనా వేసింది. ఇక కొత్త పరిశ్రమలకి పెట్టుబడి ఎక్కడుంది? వచ్చే పదేళ్ళలో నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది. దివాళా తీసి ఉన్న రాష్ట్రానికి కేంద్రం సాయం చెయ్యదు. అధికారం నిలుపుకోవటానికి పార్టీలు వేసే మెతుకలకి బలి అయ్యేది మనమే. ప్రస్తుతం ప్రమాదం చాపక్రింద నీరులా నెమ్మదిగా వస్తోంది. మరో అయిదేళ్ళకి ఇది సునామీ అవుతుంది. మళ్ళీ చెపుతున్నాను, ఇది రాజకీయ ఉపన్యాసం కాదు..! కేవలం ఆర్థిక రంగానికి సంబంధించినది !! అని యండమూరి వీరేంద్రనాథ్ సున్నితంగా హెచ్చరించారు.