Politics

పీవీకి భారతరత్నపై తెలంగాణా అసెంబ్లీలో తీర్మానం

పీవీకి భారతరత్నపై తెలంగాణా అసెంబ్లీలో తీర్మానం

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సంబంధిత కమిటీతో పాటు అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్‌ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. వివిధ రంగాల్లో పీవీ నరసింహారావు చేసిన కృషి ప్రస్ఫుటించేలా దాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీనికోసం అవసరమైన స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు. మరోవైపు నెక్లెస్‌ రోడ్డుకు పీవీ జ్ఞాన్‌మార్గ్‌గా నామకరణం చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్లో పీవీ గురించి విస్తృత చర్చ చేపడతామని కేసీఆర్‌ చెప్పారు. పార్లమెంట్‌లో పీవీ చిత్రపటం ఏర్పాటు, హైదరాబాద్‌లో పీవీ నెలకొల్పిన కేంద్రీయ వర్సిటీకి ఆయన పేరే పెట్టాలని కేంద్రాన్ని కోరతామని..దీనిపైనా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామన్నారు. అసెంబ్లీలో పీవీ తైలవర్ణ చిత్రం, చిత్తరువు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారు. పీవీ జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనిపై త్వరలోనే ఆ రెండు గ్రామాల్లో పర్యటించి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆదేశించారు.