Movies

మేము ఉంగరం కొనుక్కున్నా ఏడుస్తున్నారు!

మేము ఉంగరం కొనుక్కున్నా ఏడుస్తున్నారు!

‘‘అమ్మాయిలు ఓ ఉంగరం కొనుక్కోలేరా?’’ అని లావణ్యా త్రిపాఠీ ప్రశ్నిస్తున్నారు. దీనికో కారణం ఉంది. అదేంటంటే? శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో లావణ్యా త్రిపాఠీ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. అప్పుడొకరు ‘మీరెప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు?’ అని అడిగారు. ‘మీ చేతికి తొడగడానికి ఓ ఉంగరం ఉంది’ అని సదరు నెటిజన్‌ పరోక్షంగా ప్రపోజ్‌ చేశారు. అందుకు బదులుగా లావణ్యా త్రిపాఠీ ‘‘ఎందుకు? అమ్మాయిలు ఓ ఉంగరం కొనుక్కోలేరా? నా పుట్టినరోజున నాకు నేనే ఓ ఉంగరం బహుకరించుకుంటున్నా’’ అని చెప్పారు.డిసెంబర్‌ 15న ఆమె పుట్టినరోజు. అప్పుడు కొత్త ఉంగరం కొనుక్కుంటారని ఊహించవచ్చు అన్నమాట! లావణ్యా త్రిపాఠీ పెళ్లి ప్రశ్నలు ఆ ఒక్కదాంతో ఆగలేదు. ‘అక్కా… పెళ్లెప్పుడు?’ అని ఇంకొకరు అడిగారు. ‘‘నా తల్లితండ్రులకు లేని ఆందోళన మీకెందుకు? ఈ ప్రశ్నను దాటి ముందుకు వెళ్లలేకపోతే మీ గురించి మీరు ఆందోళన చెందండి’’ అని లావణ్యా త్రిపాఠీ సమాధానం ఇచ్చారు. లాక్‌డౌన్‌లో యాంగ్జైటీ గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కరోనా కాలంలో ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఎదురైంది. నేను యాంగ్జైటీకి లోనయినప్పుడు భవిష్యత్తులో చేయాల్సిన అంశాల గురించి లేదా నా తర్వాత చిత్రం గురించి ఆలోచించడం మొదలుపెడతా. ఏదైనా అంశం మీద ఎక్కువసేపు సమయాన్ని వృథా చేయడం ఎందుకు చెప్పండి’’ అని అన్నారు. ప్రస్తుతం సందీప్‌ కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, కార్తికేయ గుమ్మకొండ ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో లావణ్యా త్రిపాఠీ కథానాయికగా నటిస్తున్నారు.