పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన యువతి(25), అదే గ్రామానికి చెందిన కట్కం రాజ్కుమార్ స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇంటర్ తర్వాత రాజ్కుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. యువతి ఇక్కడే ఉంటూ పీజీ చేస్తోంది. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇరవై రోజుల క్రితం రాజ్కుమార్ దుబాయ్ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. యువతిని కలిసేందుకు అతడు విఫలయత్నం చేశాడు. ఫోన్ చేసినా సరిగా స్పందించకపోవడమేకాకుండా తనతో పెళ్లికి నిరాకరించిందని కోపం పెంచుకున్నాడు. ఆగ్రహంగా ఉన్న రాజ్కుమార్ శనివారం మధ్యాహ్నం జాబితాపూర్కు చేరుకున్నాడు. యువతి ఇంట్లోకి వెళ్లి కత్తితో ఆమె మెడ, వీపుపై దాడి చేశాడు. యువతి తప్పించుకొని, కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చేసరికి అతడు అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రాజ్కుమార్ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన యువతి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడి సెల్ఫోన్లో ఉన్న మెసేజ్లు, కాల్డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
జగిత్యాల యువతి మెడ కోసి తన మెడ కోసుకున్న దుబాయ్ ప్రవాసుడు
Related tags :