ScienceAndTech

పలు వైరస్‌లను కత్తిరించి అతికిస్తే….కరోనా….

పలు వైరస్‌లను కత్తిరించి అతికిస్తే….కరోనా….

భూలోకాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలపై ఇప్పటికీ స్పష్టత లేక, కుట్ర సిద్ధాంతాలను వ్యాపింపజేసేవారు ఎక్కువయ్యారు. వుహాన్‌ ల్యాబ్‌లో చైనాయే కరోనా వైరస్‌ను పుట్టించిందంటూ సామాజిక మాధ్యమాల్లో రగడ రేగుతుంటే, శాస్త్రజ్ఞులు అంత త్వరగా నిర్ధారణకు రావడానికి సుముఖంగా లేరు. మొదటి నుంచి కరోనా వైరస్‌ గురించి చైనా గుట్టు పాటించడం ప్రస్తుత వివాదానికి హేతువైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీన్ని వుహాన్‌ వైరస్‌ అని, కుంగ్‌ ఫూ వైరస్‌ అని అభివర్ణించి చైనాను మోదడానికి మితవాదులకు, సామాజిక మాధ్యమాలకు గొప్ప దుడ్డుకర్ర అందించారు. ఆయన ఆరోపణకు ఆధారాలు లేవని శాస్త్రజ్ఞులతోపాటు అమెరికా గూఢచారి సంస్థలూ పేర్కొన్నాయి. అమెరికాలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టలేక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయిన తరవాత కుట్ర సిద్ధాంతాలకు తాత్కాలికంగా తెరపడినా, ఈ నెలలో మళ్లీ చైనా కుట్ర కోణం తెరమీదకు వచ్చింది. చైనా శాస్త్రజ్ఞులు కరోనా వైరస్‌ను జీవాయుధంగా మార్చడానికి అయిదేళ్ల క్రితమే ప్రయత్నించారంటూ ‘ది ఆస్ట్రేలియన్‌’ అనే పత్రిక ఒక కథనాన్ని వెలువరించింది. అమెరికా జాతీయ ఆరోగ్య పరిరక్షణ సంస్థ (ఎన్‌ఐహెచ్‌) వుహాన్‌లోని ప్రయోగశాలకు 2015 నుంచి ఆర్థిక సహాయం చేస్తోందని రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ ర్యాండ్‌ పాల్‌ సెనెట్‌ సమావేశంలో ఆరోపించారు. ట్రంప్‌ పార్టీకి చెందిన పాల్‌ పూర్తిగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కట్టుకథలు వ్యాపింపజేస్తున్నారని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ (సీడీసీ) అధినేత ఆంటొనీ ఫౌచీ తోసిపుచ్చారు.

*** పత్రికా కథనాలు, పరిశోధన పత్రాలు
‘ది ఆస్ట్రేలియన్‌’ పత్రిక కరోనా వైరస్‌ను జీవాయుధంగా మార్చే అవకాశాలపై చైనా సైన్యానికి చెందిన శాస్త్రజ్ఞులు అయిదేళ్ల క్రితమే చర్చించారని ఒక కథనం ప్రచురించింది. తమ పరిశోధనాత్మక విలేఖరి షారీ మార్క్‌సన్‌ రాసిన ఒక పుస్తకంలోని భాగాలను ఆ పత్రిక ప్రచురించింది. చైనా సైన్యానికి చెందిన ఇద్దరు శాస్త్రజ్ఞులు 2015లో ప్రచురించిన ఒక పుస్తకంలో జీవాయుధాల గురించి చర్చించిన మాట నిజమే. చైనాపై శత్రు దేశాలు జీవాయుధాలను ప్రయోగించే ప్రమాదం గురించి వారు చర్చించారు తప్ప, చైనాయే జీవాయుధాలను రూపొందించాలని వారు ప్రతిపాదించలేదు. అసలు 1950ల నాటి కొరియా యుద్ధంలో అమెరికా తమపై జీవాస్త్రాలను ప్రయోగించిందని అనేకమంది చైనీయులు ఇప్పటికీ నమ్ముతారు. ఇలాంటి నమ్మకాలు, అనుమానాలతో పాశ్చాత్య దేశాల్లో కూడా అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇటీవలి కాలంలో చైనా, ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఆస్ట్రేలియా సభ్యురాలిగా ఉన్న ‘క్వాడ్‌’పై చైనా గుర్రుగా ఉంది. ఈ వాతావరణంలో షారీ జీవాయుధ సిద్ధాంతం ఆస్ట్రేలియాలో బాగా ప్రాచుర్యం పొందింది. షారీకన్నా ముందు లీ మెంగ్‌ యాన్‌ అనే చైనా శాస్త్రజ్ఞురాలు కూడా కొవిడ్‌ వైరస్‌ వుహాన్‌ లేబరేటరీలో పుట్టిందంటూ పరిశోధన పత్రం వెలువరించారు. లీ మెంగ్‌ 2020 ఏప్రిల్‌లో చైనా నుంచి పరారై అమెరికాలో ఆశ్రయం పొందారు. ఆమె ఆరోపణకు ఆధారాలు లేవని ప్రపంచ ప్రసిద్ధ ఎంఐటీ విశ్వవిద్యాలయం తేల్చిచెప్పినా- లీ మెంగ్‌ పత్రం యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో విస్తృతంగా వ్యాపించింది. మితవాద ఉద్యమ సంస్థ క్యూఏనన్‌ ఈమె ఆరోపణలను తలకెత్తుకుంది. ట్రంప్‌ ప్రేరణపై అమెరికా అధ్యక్ష భవనంపై దాడిచేసిన వారిలో క్యూఏనన్‌ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

*** కొరవడిన స్పష్టత
బీజింగ్‌ కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి చెప్పకుండా దాచినందు వల్ల్లే పరిస్థితి చేయిదాటి పోయిందని ప్రపంచ దేశాలు ఆగ్రహిస్తున్నందున తప్పును అమెరికాపైకి తోసేయడానికి చైనా నడుంకట్టింది. అసలు కరోనా వైరస్‌ను అమెరికా సైన్యమే ప్రయోగశాలలో పుట్టించిందని, 2019లో వుహాన్‌లో ప్రపంచ సైనిక క్రీడోత్సవంలో పాల్గొన్న అమెరికా సైనిక అథ్లెట్లు ఈ వైరస్‌ను వ్యాపింపజేశారని చైనా ఆరోపించింది. కరోనాకు జన్మదాత అమెరికాయేనన్న ప్రచారాన్ని అంతర్జాలంలో వ్యాప్తిచేయడంలో బీజింగ్‌కు రష్యా, ఇరాన్‌లు తోడ్పడ్డాయి. దీనికి ప్రతిగా వుహాన్‌ ల్యాబ్‌లో వైరస్‌ జన్మ సిద్ధాంతాన్ని అమెరికన్లు వ్యాపింపజేశారు.
ఒకటి మాత్రం నిజం. అమెరికా, ఐరోపా దేశాల్లో వివిధ వైరస్‌ల నుంచి కొన్ని భాగాలను కత్తిరించి, ఇతర వైరస్‌లకు అతికించే ప్రయోగాలు చాలాకాలంగా జరుగుతూ వస్తున్నాయి. వుహాన్‌ ల్యాబ్‌లో అలాంటి ప్రయోగాలు వికటించి కొవిడ్‌ వైరస్‌ ప్రమాదవశాత్తూ లీక్‌ అయి ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. ఇంకొందరు ఈ వైరస్‌ జంతువుల నుంచి మానవులకు పాకి ఉండొచ్చని వాదిస్తున్నారు. గతంలో సార్స్‌ కారక వైరస్‌ గబ్బిలాల నుంచి సివెట్‌ పిల్లులకు, అక్కడి నుంచి మానవులకు సోకిందని నిర్ధారణ అయింది. మెర్స్‌ వైరస్‌ ఒంటెల నుంచి మానవులకు పాకినట్లు తేలింది. కొవిడ్‌ కారక వైరస్‌ గబ్బిలాలు, అలుగుల నుంచి మానవులకు పాకిందనే వాదనలు వినిపించినా, అవి తిరుగులేని విధంగా రుజువు కాలేదు. కరోనా మహమ్మారి ప్రయోగశాల నుంచి లీక్‌ అయిందా లేక జంతువుల నుంచి పాకిందా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. వుహాన్‌ను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఈ రెండు సిద్ధాంతాలను క్షుణ్నంగా పరిశీలించి నిజాన్ని నిగ్గు తేల్చలేదని శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు. కరోనా వైరస్‌ పుట్టుక గురించి స్పష్టత ఉంటే దాన్ని అంతం చేయడానికీ మార్గం దొరుకుతుంది.