Health

ఆనందయ్యది నాటుమందు…ఆయుర్వేదం కాదు!

ఆనందయ్యది నాటుమందు…ఆయుర్వేదం కాదు!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందును నాటుమందుగా గుర్తించినట్లు రాష్ట్ర ఆయుష్‌ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు కమిషనర్‌ కర్నల్‌ రాములు నేతృత్వంలో వైద్యబృందం నెల్లూరు జిల్లాలో పర్యటించి ఆనందయ్య తయారుచేస్తున్న మందులను పరిశీలించింది. పర్యటనకు ముందే హైదరాబాద్‌ ల్యాబ్‌లో మందు నమూనాలను పరీక్ష చేయించింది. ఆ ఫలితాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆనందయ్య ఇచ్చిన వివరాల ఆధారంగా దాన్ని నాటుమందుగా గుర్తించామని ఆయుష్‌ శాఖ కమిషనర్‌ కర్నల్‌ రాములు ‘ఈనాడు’కు తెలిపారు. వంశపారంపర్యంగా మందులు ఇస్తుంటారని, ఆ క్రమంలోనే ఇది కూడా ఒక నాటు మందని పేర్కొన్నారు. ఈ మందులో హానికారక పదార్థాలు ఏమీ లేవని వెల్లడించారు. అయితే దీన్ని ఆయుర్వేద మందుగా మాత్రం తాము పరిగణించట్లేదని స్పష్టంచేశారు. ఈ మందు వినియోగం విషయంలో ఎవరికి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. దిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్స్‌కు ఇక్కడి పరిస్థితులపై ఓ నివేదికను పంపనున్నట్లు తెలిపారు. తిరుపతి, విజయవాడల్లోని ఆయుర్వేద వైద్యులు ఈ నివేదికను తయారు చేస్తారని పేర్కొన్నారు. కర్నల్‌ బృందం రెండురోజుల పర్యటనలో తొలిరోజు మందు కోసం వచ్చిన వారిని కలుసుకుని వారి అభిప్రాయాలు సేకరించింది. ఈ మందును వాడిన వారి నుంచి కూడా వివరాలు తెలుసుకుంది. వారంతా మందు వినియోగంపై సానుకూలత వ్యక్తం చేశారు. రెండోరోజు ఏయే ముడిసరకులు, పదార్థాలను ఉపయోగించి ఈ మందులు తయారుచేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకున్నారు. పచ్చకర్పూరం, పసుపు, నల్ల జీలకర్ర, వేప ఇగురు, మారేడు ఇగురు, ఫిరంగి చెక్క, దేవరబంగి వంటివి ముడి పదార్ధాల్లో ఉన్నాయి. ఆనందయ్య తనకున్న అనుభవం ఆధారంగా పిడికిలి కొలతతోనే వాటిని వాటిని మిక్సీలో వేసి పౌడరు (పొడి) రూపంలో తయారుచేస్తున్నారు. అలాగే ముళ్ల వంకాయ, తోకమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని చుక్కల మందు రూపంలో కంట్లో వేస్తుండటాన్ని కూడా పరిశీలించారు. తమ బృంద పరిశీలనలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని కర్నల్‌ రాములు వెల్లడించారు. ఐసీఎంఆర్‌ బృందం నెల్లూరు జిల్లాకు వస్తుందనడంలో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. కొవిడ్‌ బాధితులకు ఆనందయ్య ఇస్తున్న మందును తితిదే ఆయుర్వేద విభాగంలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.